చదువు ఉన్నది.. పని చేయాలన్న తపన, స్వయం కృషితో ఎదుగాలన్న పట్టుదల ఉన్నది. అయితే.. ఆర్థిక స్తోమత లేక, తన కలలను నెరవేర్చుకోలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారు. దళితులు స్వయం కృషితో ఎదిగేలా ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేద దళిత యువతకు దిక్సూచిగా మారింది. అర్హులైన దళితులకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీపై రుణం అందజేసింది. ఆ డబ్బు లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
– మిర్యాలగూడ రూరల్, జూలై 30
కాంగ్రెస్ పాలనలో స్వయం ఉపాధికి ఆర్థిక సహాయమన్నదే లేదు. ఉన్నా తమ అనుయాయులకే దక్కేది. దక్కిన వారు సైతం డబ్బులు తీసుకోవడం తప్ప స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసేవారు కాదు. దీంతో సహాయం స్వలాభం కోసం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడలా కాదు.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం పకడ్బందీగా అమలయ్యేలా చూశారు. దళితబంధు తొలి విడుతలో మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో 26 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.9.90 లక్షల చొప్పున అందజేశారు. ఆ డబ్బుతో లబ్ధిదారులు తమకు అనుకూలమైన ఉపాధి యూనిట్ను ఎంచుకొని ప్రారంభించారు. అందులో 12 మంది ట్రావెలింగ్ ఆటోలు కొనుగోలు చేయగా, ఆరుగురు ట్రాక్టర్లు, ముగ్గురు కలిసి జేసీబీని, మరో ఇద్దరు కలిసి డీసీఎంను తీసుకున్నారు. మిగిలినవారు టెంట్హౌజ్, ఫొటో స్టూడియో, జిరాక్స్ సెంటర్, హౌజ్ ఇంటీరియల్ సామగ్రి షాపు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు.
నేను అగ్రికల్చర్ డిప్లమో పూర్తి చేశాను. స్వశక్తితో బతుకాలన్నదే నా ఆకాంక్ష. మూడు సంవత్సరాలుగా ఏదైనా బిజినెస్ చేయాలన్న ఆలోచన చేస్తున్నా. ఆర్థిక ప్రోత్సాహం లేక ఒకరి దుకాణంలో వేతనం కోసం పని చేశాను. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేయడంతో యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నా. నాకు యూనిట్ మంజూరు కావడంతో మీ సేవ, నెట్ సెంటర్ ఏర్పాటు చేసుకొని స్వయంగా నిర్వహిస్తున్నా. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30నుంచి 40వేల వరకు లాభం వస్తుంది. స్వశక్తితో బతుకాలన్న కోరిక నెరవేరింది. నా జీవితానికి మార్గం చూపిన దేవుడు సీఎం కేసీఆర్.
– మచ్చ మధుకర్, దళిత బంధు లబ్ధిదారు, వీటీ పాలెం
నేను చదువుకున్న రైతును. వ్యవసాయంపై మక్కువతో నాకున్న భూమితోపాటు కొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. దళిత బంధు రానప్పుడు నా భూమిని ఇతరుల ట్రాక్టర్తో కిరాయికి దున్నిచ్చేది. నాకు దళిత బంధు పథకం రావడంతో ట్రాక్టర్ను కొనుగోలు చేశాను. ఇప్పుడు కూలీ నుంచి యజయానిగా మారాను. నా భూమిని నేనే దున్నుకుంటున్నా. ట్రాక్టర్ ఉండడంతో సమయానికి నారు పోసుకోవడంతోపాటు నాట్లు వేస్తున్నా. – చింతల వెంకటేశ్వర్లు, దళిత బంధు లబ్ధిదారు, వీటీ పాలెం
ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు డబ్బుతో యూనిట్లు ఏర్పాటు చేసుకొని స్వయంగా, చక్కగా నిర్వహిస్తున్నారు. గతంలో కిరాయికి తీసుకొని ఆటో నడిపినవారు కొందరైతే, షాపుల్లో గుమస్తాగా చాలీచాలని వేతనంతో పనిచేసే వారు మరికొందరు. ఇప్పుడు వారందరూ తమకు ఇష్టమైన యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయంగా నిర్వహించుకుంటూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్వశక్తితో జీవనం కొనసాగించడంతో వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం వారి జీవితాల్లో వెలుగు నింపిందనే చెప్పాలి.
– గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీడీఓ, మిర్యాలగూడ