మన సాంస్కృతిక ప్రతిబింబం.. తొమ్మిది రోజుల పూల పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆదివారం జరుపుకొనేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నుంచే పెద్ద బతుకమ్మను పేర్చేందుకు పూలు కొనుగోలు చేస్తూ కనిపించారు. మరోవైపు ప్రజలు కుటుంబ సమేతంగా దసరా షాపింగ్ చేస్తుండడంతో మార్కెట్లో సందడి నెలకొంది. పండుగ కోసమని పట్నం నుంచి పల్లె బాట పట్టిన ప్రజలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి.
– రామగిరి, అక్టోబర్ 21
రామగిరి, అక్టోబర్ 21 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు ఆదివారం సద్దుల బతుకమ్మకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధం చేశారు. బతుకమ్మలు పేర్చేందుకు మార్కెట్లో రకరకాల పూలు విక్రయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడంతో పూల సెంటర్లు కిటకిటలాడాయి. ప్రధానంగా తంగేడు, బంతి, గునుగు, చామంతి పూలకు గిరాకీ నెలకొంది. తంగేడు పూలను సైజును బట్టి కట్ట రూ.30నుంచి రూ.50వరకు, బంతి పూలు కిలో రూ.80 నుంచి రూ.100 వరకు, చామంతి పూలను కిలో రూ.250 చొప్పున విక్రయించారు.
నల్లగొండ పట్టణంలో గడియారం సెంటర్, రామగిరి, ప్రకాశంబజార్, హైదరాబాద్ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు పూల కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. అదేవిధంగా దసరా పండుగ నేపథ్యంలో కొనుగోలుదార్లతో వస్త్ర దుకాణాలు, ఆభరణాలు, చెప్పుల షాపుల్లో రద్దీ నెలకొంది. పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండడంతో బస్టాండ్లు కిటకిటలాడాయి.