ఘనంగా శిరీష వివాహం
నిరుపేద యువతికి అండగా నిలిచిన దాతలు
రూ.2.5 లక్షలు అందజేత
దగ్గరుండి పెండ్లి జరిపించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన
సంస్థాన్ నారాయణపురం, జూన్19 : తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగా.. ఆదివారం మండలంలోని చారకొండతండాకు చెందిన కొర్ర శిరీష వివాహం ఘనంగా జరిగింది. శిరీష తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని వదిలేసి తిరుగుతుండగా తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని సాకుతున్నది. పెద్ద కూతురైన శిరీష వివాహం అదే గ్రామానికి చెందిన కాట్రోతు శ్రీనునాయక్తో ఖరారైంది. చేతిలో చిల్లిగవ్వలేక పోవడంతో తన వివాహానికి సాయం చేయాలని దాతలను వాట్సాప్ ద్వారా కోరింది.
మానవత్వం చాటుకున్న దాతలు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష రూపాయలను కాంగ్రెస్ నాయకుల ద్వారా పంపించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వధూవరులకు పెండ్లి బట్టలు అందించడంతో పాటు విందు ఖర్చును భరించారు. పెండ్లి పెద్దగా వ్యవహరించి దగ్గర ఉండి పెండ్లి జరిపించారు. అతిథులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ పుస్తె, మెట్టెలు, పట్టు వస్ర్తాలను అందించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నరబోయిన రవి రూ.10 వేలు, కంచర్ల కృష్ణారెడ్డి రూ.10 వేలు ఇచ్చారు. దాంతో పాటు కొంత మంది దాతలు ఫోన్పే ద్వారా డబ్బులు పంపించారు. మొత్తం మీద శిరీషకు రూ.2.50 లక్షల సాయం అందింది. అడిగిన వెంటనే సాయం చేసిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని శీరిష తెలిపింది. తమ బాధలను పదిమందికి తెలిపి అండగా నిలిచిన నమస్తే తెలంగాణ దినపత్రికకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. బిడ్డ పెండ్లి అవుతుందో లేదోనని భయపడ్డానని, బిడ్డ పెండ్లికి ఇంత మంది వచ్చి సాయం చేస్తారని కలలో కూడా అనుకోలేదని శిరీష తల్లి సుగుణ పేర్కొంది. సాయం చేసిన ప్రతి ఒక్కరికీ దండాలంటూ కన్నీటి పర్యంతమైంది.