నీలగిరి, మార్చి 21 : నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటిని అరికట్టాలని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తిని కలిసి గురువారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలపై బనాయించిన కేసులను, వారిపై జరిగిన దాడులను ఎస్పీకి వివరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల అగడాలు ఎక్కువయ్యాయన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయంలో స్టేషన్కు పిలిపించి విపరీతంగా కొడుతున్నారని ఆరోపించారు. 2014లో నియోజకవర్గంలో జరిగిన సంఘటనలే మళ్లీ జరుగుతున్నాయని అన్నారు. మూడు నెలల్లో కేతేపల్లిలోనే అనేక సంఘటనలు జరిగాయని చెప్పారు.
కేతేపల్లిలో ఎస్సీ అబ్బాయిని చెట్టు కు కట్టేసి కొడుతున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి అతడిని విడిపించి అతడిపైనే కేసులు పెట్టారని అన్నారు. గుడివాడలో నర్సయ్య అనే వ్యక్తి తన వృత్తి చేసుకుంటూ బోర్లు వేసుకుంటే కనికరం లేని పోలీసులు దెబ్బలు తగిలి ఉన్నా కూడా బొక్కలు విరిగేలా కొట్టారని తెలిపారు. పోలీస్ స్టేషన్లను వేదికలుగా చేసుకుని సెంటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వ తం కాదని, నియంతలం అనుకునే వారికి ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు.