నకిరేకల్, ఏప్రిల్ 8 : ఓ పక్క ముఖ్యమంత్రి కొంతమంది గూండాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నడని, మరో పక్క నకిరేకల్ ఎమ్మె ల్యే వీరేశం రైతులను విచక్షణా రహితంగా కొట్టడం, తన్న డం చేస్తున్నాడని.. ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా.. రైతులకు ప్రశ్నించే హక్కు లేదా..అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం, అతడి అనుచరులు రైతులను విచక్షణా రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. దాదాపు 100 మంది రైతులు అక్కెనపల్లి మార్కెట్ నుంచి ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకెళ్తే కటింగ్ ఎక్కువ చేస్తున్నారని, క్వింటాకు 6 నుంచి 7 కేజీలు తరుగు తీస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారన్నారు. అలాగే సన్నాలను మిల్లర్లు కొనుగోలు చేయ డం లేదని ఫిర్యాదు చేశారన్నారు. రెండోసారి రైతులు అడగడంతో నచ్చని ఎమ్మెల్యే అక్కడున్న రైతుల చెంపల మీద కొట్టినట్లు తెలిపారు. రైతును కొట్టే క్రమంలో మరో రైతు వీడియో తీస్తున్నాడని, ఎమ్మెల్యే అనుచరుడు అతడి సెల్ఫోన్ను లాక్కొని నేలకేసి కొట్టాడన్నారు.
ఎమ్మెల్యేకే ఎదు రు తిరుగుతార్రా..అంటూ రైతు కాలర్ పట్టుకొని చెంపల మీద కొట్టడాన్ని మరో రైతు వీడియో తీస్తుండగా చిట్యాలకు చెందిన ఎమ్మెల్యే అనుచరులు ఆయనను కూడా విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు కాలుతో తన్నడం ఎమ్మెల్యే రౌడీయిజానికి అద్దం పడుతోందన్నారు. ఎందుకు కొడుతున్నారని రైతులంతా కల్లాల నుంచి పరిగెత్తుకొని వచ్చి ప్రశ్నిస్తుంటే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేను బతిమిలాడి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారన్నారు. ప్రశ్నిస్తే తప్పు, రైతులు తమ బాధల విషయమై మొరపెట్టుకుంటే తప్పు, ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నించా రు.
ప్రజాప్రతినిధిగా ఉంటూ.. ఎందుకు కొనుగోలు కేం ద్రాలకు వెళ్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రైతులను కొట్టడం, బూతులు తిట్టడం.. కాలు లేపడం చేస్తారా.. అని ప్రశ్నించారు. ఓట్లేసింది రైతులను కొట్టేందుకేనా అన్నారు. సమస్యలు పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడాలే గానీ, రైతులను కొట్టే హక్కు ఎమ్మెల్యేకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సదరు రైతులు ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్కు వస్తే ఎస్సై బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడన్నా రు. వీరేశంపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు పెండెం సదానందం, దైద పరమేశ్ ఉన్నారు.