సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 10: తెలంగాణ ఏర్పాటుకు ముందు మెరుగైన వైద్యం కోసం పేద, మధ్య తరగతి జనం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు. మరి కొందరు డబ్బులు వెచ్చించ లేక మెరుగైన వైద్యం లభించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లాలు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను కళ్లార చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాల వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ప్రభుత్వ జనరల్ దవాఖానలు ఏర్పాటు చేయాలని యోచించారు. అందులో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే, అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చోరవతో ఇక్కడి దవాఖానను అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు.
సూర్యాపేట జిల్లా ప్రజలతో పాటు సరిహద్దు జిల్లాలోని ప్రజలు సైతం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఈ దవాఖానకే వచ్చేలా చేశారు. అలాంటి దవాఖాన నేటి పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా కునారిల్లుతోంది. కాంగ్రెస్ పాలకుల అలసత్వం రోగుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆరకొర వసతులతో 100 పడకల ఏరియా దవాఖానగా ఇది ఉండేది . దీంతో రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి లక్షల్లో ఖర్చు చేసేవారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించే వారు కాదు. నొప్పి వచ్చినా.. రోగం వచ్చినా.. ప్రైవేట్ దవాఖానలకే వెళ్లేవారు. అలాంటి స్థితిలో ఉన్న ఏరియా దవాఖానను 400ల పడకలకు పెంచి అన్ని హంగులతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డికే దక్కింది.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించి అందుకు తగిన అన్ని ఏర్పాట్లతో ఓ ప్రత్యేక భవనం నిర్మించి మాతా శిశు సంక్షేమం కేంద్రం ఏర్పాటు చేశారు. రక్త పరీక్షల కోసం అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెచ్చి నిపుణులను నియమించారు. అయితే నేడు పట్టించుకునే వారే లేక లేక పర్యవేక్షణ కొరవడి సరైన నిపుణులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తిరిగి ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. 2014కు ముందు మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు డయాలసిస్ కోసం నెలకు రెండు సార్లు హైదరాబాద్ వెళ్ళే వారు. అలాంటి వారి కోసం జిల్లా కేంద్రంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు.
నేడు ఇది పూర్తి స్థాయిలో వినియోగంలో లేదని రోగులు వాపోతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టడం, కణుతులు, ఎముకలు, వివిధ శరీర అంతర్గత కణాలను, వ్యాధులను గుర్తించేందుకు సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆధునాతన వైద్య యంత్రాలతో పాటు టీడయాగ్నోస్టిక్ సెంటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, డే కేర్ థీమో థెరపీ సెంటర్, ఎలర్జీ కేర్ సెంటర్, ఆరోగ్య మహిళా సెంటర్, సీటీ స్కాన్ సెంటర్, రేడియాలజీ విబాగం ఏర్పాటు చేయడంతో అన్ని రకాల మందులను బీఆర్ఎస్ ప్రబుత్వం రోగులకు ఉచితంగా అందించింది.
రోగులు, వారి సహాయకులు, వయో వృద్ధులు, చిన్నారుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా అన్ని రకాల మందులు అందుబాటులో లేక పోవడంతో బయటి మెడికల్ షా పుల వద్దకు వెళుతున్నారు. రేడియాలజీ విభాగంలో పని చేసే వైద్య నిపుణులు లేక ఏడాది పాటు ఆ యంత్రాలను వినియోగించే వారే లేరు. దీంతో రోగులు ప్రైవేట్ రేడియాలజీ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే నిర్వాహణ సరిగా లేక లిఫ్ట్ మొరాయిస్తోంది.
పలు సందర్భాల్లో లిఫ్ట్ మొరాయించి రోగులు, వైద్యులు అందులో ఇరుక్కుపోవడంతో పైర్ సిబ్బంది వచ్చి వారిని సురక్షితంగా బయటకు తీసిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల నమస్తే తెలంగాణాలో వరుస కథనాలు రావడంతో రేడియాలజీ విభాగం, లిఫ్ట్లు పని చేస్తున్నాయి. రోగులు గత పాలనలో ఉన్న మెరుగైన వైద్య సేవలు వసతులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పాలకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. గత వైభవం తిరిగి రావాలని కోరుకుంటూ అది బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.