నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట మార్చి 30 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల్లు ఏ చింతా లేకుండా వ్యవసాయం చేసిన రైతన్నను వంద రోజుల కాంగ్రెస్ పాలన కష్టాల సుడిగుండంలోకి నెట్టింది. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆలోచన చేయకుండా పచ్చటి పొలాలను ఎండబెట్టింది. కండ్ల ముందే కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు ఎండిపోతుంటే దిక్కులేని స్థితిలోకి నెట్టింది. అండగా నిలువాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే.. రైతు బాంధవుడు, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు ఎండిన పొలాలను పరిశీలించి, రైతుల కష్టాలను తెలుసుకుని, అండగా నిలిచేందుకు పర్యటనకు సిద్ధమయ్యారు.
జనగామ జిల్లా నుంచి ఉదయం 11.30 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సూర్యాపేట వరకు మార్గమధ్యంలో ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. రైతులతో మమేకం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో తన పరిశీలనలోని అంశాలతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మీడియా సమావేశంలో కేసీఆర్ స్పందించనున్నారు. సాయంత్రం 4.30గంటలకు నిడమనూరుకు చేరుకుని సాగర్ ఆయకట్టులో ఎండిన పంటలను పరిశీలిస్తారు.
6 గంటలకు తిరుగుప్రయాణమై రాత్రి 9గంటలకు తిరిగి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్కు చేరుకోనున్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్వంలో కేసీఆర్ పర్యటన సజావుగా సాగేలా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు కలిసి ప్రణాళిక సిద్ధం చేశారు. కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారని, తమ బాధలు చెప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని జగదీశ్రెడ్డి చెప్పారు.
పచ్చని వ్యవసాయం, రైతు సంక్షేమమే ధ్యేయంగా పదేండ్లు రాష్ర్టాన్ని పాలించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన కండ్ల ముందే రైతులు ఇబ్బందులు పడుతుంటే చలించారు. అందుకే క్షేత్రస్థాయిలో స్వయంగా రైతులతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని భావించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో రైతులను కష్టాలు చుట్టుముట్టాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ సమయంలో అటు కాళేశ్వరం ఇటు సాగర్ నుంచి సాగునీటి కోసం రైతులు ఆశగా ఎదురుచూశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశలను వమ్ము చేసింది. నీళ్లిచ్చే వైపున కనీస ఆలోచన కూడా చేయలేదు. పైగా గత పాలకులపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తూ రైతును గాలికి వదిలేసింది. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయింది. పండ్ల తోటలు సైతం తుడిచి పెట్టుకు పోయాయి. దాంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు వేలాది బోర్లను తవ్వారు. అయినా ఫలితం లేక రెండు విధాలుగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నీటి పారుదల మంత్రి ఉత్తమ్తోపాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక్కరోజు కూడా దీనిపై సమీక్ష చేసిన దాఖలాలు లేవు.
జిల్లా మీదుగా ఖమ్మానికి నీటిని తరలించుకుపోయి పంటలను కాపాడుకుంటున్నా వీరికి జిల్లా రైతాంగం పట్టలేదు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. మాజీ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పంటలను పరిశీలిస్తూ రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జిల్లావ్యాప్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ అధినేత కేసీఆర్కు జగదీశ్రెడ్డి తెలియజేశారు. దాంతో చలించిన కేసీఆర్ ఆదివారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 8.30గంటలకు ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానున్నది.
ఉదయం 8.30గంటలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బయల్దేరి 10.30గంటల వరకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలతో పాటు రైతులతో భేటీ అవుతారు. ఉదయం 11.30గంటలకు సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తూ మధ్యాహ్నం 1.30గంటలకు జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి 3గంటలకు సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4.30గంటల వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటల పరిశీలన, రైతులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు పయనం అవుతారు. నల్లగొండ మీదుగా తిరిగి రాత్రి 9గంటల వరకు ఎర్రవెల్లి ఫాంహౌస్కు చేరుకోనున్నారు.