యాదాద్రి భువనగిరి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి వద్ద మంటలు చెలరేగాయి. రైలులో మొత్తం 18బోగీలు ఉండగా, ఉదయం 10.09గంటలకు ఎస్4 బోగీలో ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో వరుసగా ఏడు బోగీలకు మంటలు వ్యాపించాయి. బోగీల్లో పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎస్4 బోగీలో ఓ వ్యక్తి చైన్లాగి రైలును ఆపారు. దాంతో ప్రాణ నష్టం జరుగలేదు. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ప్రయాణికులంతా తమ వెంట తెచ్చుకున్న సామాన్లు, వస్తువులన్నీ వదిలేసి పరుగులు తీశారు. ప్యాసింజర్లకు చెందిన వస్తువులు, సామాన్లతోపాటు బోగీలు బూడిదయ్యాయి. కాలిన ఏడు బోగీలను ప్రమాద స్థలంలోనే ఉంచి.. 11 బోగీలతో కూడిన రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పంపించారు. అయితే.. ఘటనపై పలు అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఓ వ్యక్తి సిగరెట్ తాగాకే మంటలు వచ్చాయని ఓ వాదన, షార్ట్ సర్యూట్ అని మరో వాదన వినిపిస్తున్నది. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే విచారణకు ఆదేశించింది.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, చర్లపల్లి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. మంటలు వ్యాపిస్తుండటంతో ఇంజిన్తో మొదటగా ఐదు బోగీలను వేరుచేశారు. అర్ధ గంట తర్వాత ఓవర్హెడ్ విద్యుత్ను డిస్ కనెక్ట్ చేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది బోగీల్లో నీటితో మంటలార్పే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆరో కంపార్ట్మెంట్కు కూడా మంటలు అంటుకున్నాయి. మరోవైపు గ్యాస్ ద్వారా కూడా అగ్నికీలలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు సైతం పెద్ద ఎత్తున ప్రమాదస్థలికి చేరుకున్నారు. సీపీ చౌహాన్ సందర్శించి పోలీసులకు సూచనలు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ప్రమాద స్థలికి హుటాహుటిన తరలివచ్చారు.
నీళ్లు, భోజనం, రవాణా సదుపాయం
ప్రమాద విషయం తెలియగానే అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ పమేలా సత్పతి ట్రాక్ వద్దకు వచ్చారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. వినీత అనే అమ్మాయి ఒరిజినల్ సర్టిఫికెట్లు రైలులో కాలి బూడిద కాగా.. ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించారు. కిందిస్థాయి అధికారులకు సూచనలు చేశారు. ట్రాక్ పక్కనే మైనార్టీ గురుకులం ఉండటంతో క్యాంప్ మాదిరి ఏర్పాటు చేశారు. ప్యాసింజర్లకు నీళ్లు, టాయిలెట్ సదుపాయం కల్పించారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. అక్కడే ప్యాసింజర్లతోపాటు పోలీసులు, సహాయక సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రయాణికులను తమ ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో మైనార్టీ గురుకుల ఫ్యాకల్టీ, విద్యార్థులు రైలు వద్దకు వెళ్లి తమ వంతు సాయం చేశారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నారు. మీడియాకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రయాణికులను రైలులో నుంచి జాగ్రత్తగా కిందకు దింపారు. మైనార్టీ గురుకులానికి తీసుకెళ్లి సహాయక చర్యలు చేశారు.
వరుస రైలు ప్రమాదాలు మోదీ అసమర్థ పాలనకు నిదర్శనం
నందికొండ, జూలై 7 : దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని తమ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, 300 మంది ప్రాణాలను కేంద్రం పొట్టన పెట్టుకున్నదని అన్నారు. అది మరువక ముందే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం జరుగడం దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలతో రాష్ర్టాల్లో తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చే దిశగా కేంద్రం కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. కేంద్రం తీరుతో రాజకీయం, యంత్రాంగం, జ్యుడీషియల్పై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదన్నారు.
60 ఏండ్ల పాలనలో గత ప్రభుత్వాలు రూ.57లక్షల కోట్లు అప్పులు చేయగా, మోదీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలోనే వంద లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. బీజేపీ పాలనలో జీడీపీ బాగా పడిపోయిందన్నారు. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా మన దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గలేదని విమర్శించారు. రూపాయి విలువ విదేశీ మార్కెట్లో బాగా పడిపోయిదని, దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని, మతతత్వ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిదని, అందుకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని మార్చుకున్నదని అన్నారు. 9 ఏండ్లు గడుస్తున్నా రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి ఏ విషయాలనూ కేంద్రం తెల్చలేదని, తెలంగాణకు రావలసిన వాటాలను ఇవ్వలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టాం
రైలు ప్రమాద విషయం తెలుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టాం. నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పట్టణంలోని జాగృతి కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైలు ప్రమాదం జరిగిన విషయాన్ని కలెక్టర్ మేడం ద్వారా తెలుసుకుని వెంటనే అప్రమత్తమై ప్రమాదస్థలికి చేరుకున్నాం. వెనువెంటనే రైలులో ఉన్న ప్రయాణికులను, వారి విలువైన సామాగ్రితోపాటు సురక్షితంగా తరలించాం. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండటం వల్ల పెను ప్రమాదం, ప్రాణనష్టం సంభవించలేదు. ఇలాంటి ప్రమాదం జరుగడం దురదృష్టకరం.
– సరగడ కరణ్, నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు, భువనగిరి
ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలిపోయినయ్
ఎస్4 బోగీలో మా సీట్ నంబర్స్ 27, 28, 29లో ఉన్నాం. ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియలేదు. చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి. మంటలు రావడంతో నాతోపాటు మా అమ్మ, నాన్న కిందికి దిగిపోయాం. ఒరిజనల్ సర్టిఫికెట్లు బ్యాగులోనే ఉండిపోయాయి. అప్పటికే బోగీలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో వెళ్లలేని పరిస్థితి. సర్టిఫికెట్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. కలెక్టర్ చొరవ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్న. నేను ఒడిశా యూనివర్సిటీ ఇంజినీర్ కంప్లీట్ చేశాను.