జహీరాబాద్, ఆగస్టు 16: అంతరించిపోతున్న పలు ఆకుకూరల గురించి బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆకు కూరల పండుగ నిర్వహించారు. దిడ్గి గ్రామ శివారులోని డీడీఎస్-కేవీకే కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాగుచేయకుండా సహజసిద్ధంగా పొలాల్లో పండే ఆకుకూరలను ప్రదర్శించారు.
వాటిలో ఉండే పోషక విలువల గురించి డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు, మహిళా రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిఫుణులు, రైతులు, సందర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్, ఝరాసంగం మండలంలోని పోట్పల్లి గ్రామాల శివారుల్లోని జీవ వైవిధ్య పొలాలను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిఫుణులు, రైతులు సందర్శించారు.
డీడీఎస్ మహిళా సంఘం సీనియర్ కార్యకర్తలు, మహిళా రైతులు మొగులమ్మ, కాశమ్మ, లక్ష్మమ్మ మాట్లాడుతూ.. మార్కెట్లో పాల కూర, తోటకూర, గోంగూర, మెంతి కూర,బచ్చలి కూర లభిస్తున్నాయని తెలిపారు. సాగు చేయకుండానే పొలాల్లో బచ్చలి కూర, ఎలుక చెవుల కూర, ఆడవి సోయకూర, తెల్లగర్జ కూర, బంకటి ఆకు, తడకదొబ్బుడు, పుష్పకూర, గనుగకూర, బంకటి కూర, ఉత్తరేణి వంటి సహజ సిద్ధంగా లభిస్తాయని తెలిపారు.
ఇవన్నీ పొలాల్లో పెరుగుతాయని, ఈ ఆకు కూరలకు విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండా పొలాల గట్లలపై, అడవుల్లో వాటంతట అవే మొలకెత్తుతాయని చెప్పారు. ప్రస్తుతం చాలామందికి వాటి గురించి తెలియకపోవడంతో కలుపు మొక్కలుగా భావిస్తున్నారని తెలిపారు. ఆకు కూరలను వండుకుని తినడంతో మన శరీరానికి అనేక పోషక విలువలు లభిస్తాయన్నారు. తొమ్మిదేండ్లుగా డీడీఎస్ ఆధ్వర్యంలో సాగు చేయని ఆకుకూరల పండుగ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. సాగుచేయని ఆకుకూరల గుర్తింపు, వంటల తయారీ తదితర వాటి గురించి మహిళల నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు డీడీఎస్ మహిళా సంఘాల కార్యకర్తలు, రైతులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. దిశ ఫౌండేషన్ ప్రతినిధి సత్యనారాయరాజు మాట్లాడుతూ.. సాగు చేయని ఆకుకూరలపై మరింత పరిశోధనలు చేసి అవగాహన కల్పించేలా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని కోరారు.
అనంతరం డిడ్గి గ్రామ శివారులోని డీడీఎస్-కేవీకే విజ్ఞాన కేంద్రంలో సాగు చేయని ఆకుకూరల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వాటి గురించి శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిఫుణులు, రైతులు మహిళ సంఘాల కార్యకర్తలు, రైతలను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిఫుణులు, సందర్శకులకు 20 రకాల ఆకుకూరలతో డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు స్పెషల్ మిల్లెట్ లంచ్ను ఏర్పాటు చేశారు. ఆకుకూరలతో వండిన వంటకాలను తిని సంతోషం వ్యక్తం చేశారు.