చందంపేట ఫిబ్రవరి 26 : వేసవి దృష్ట్యా అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చందంపేట మండలంలోని పెద్దమూల, చిత్రియాల, రేకులవలయం, కంబాలపల్లి, పాత కంబాలపల్లి గ్రామాల సమీపంలో సోమవారం వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంబాలపల్లి రేంజ్ పరిధిలో వన్య ప్రాణులు వేసవిలో నీటి దప్పిక తీర్చుకునేందుకు సాసర్ పిట్స్లో నీటిని నింపుతున్నామని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో 46 సాసర్ పిట్స్, 15 నీటి కుంటలు ఉన్నాయని చెప్పారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో బయటి వ్యక్తులు ప్రవేశించరాదని హెచ్చరించారు. వన్య ప్రాణులను వేటాడినా, అక్రమంగా కలపను తరలించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓలు సాయిప్రకాశ్, భాస్కర్, సెక్షన్ ఆఫీసర్లు రాగ్యానాయక్, సైదులు, శ్రీదేవి, బీట్ ఆఫీసర్లు చంద్రకళ, ప్రీతి ఉన్నారు.