చందంపేట, జనవరి 17 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ ప్రాంతంలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలను ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో శాకాహార జంతు గణనను బుధవారం ఎఫ్డీఓ సర్వేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 20 వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో శాకాహార జంతు గణన చేపట్టినట్లు తెలిపారు. జంతువుల పాద ముద్రలు, ట్రాప్ కెమెరాలు తదితర పద్ధతుల ద్వారా జంతు గణన ఉంటుందన్నారు.
నాగార్జునసాగర్ పరిధిలోని 40 బీట్లలో 80 మంది అటవీ శాఖ అధికారులతో మూడు రోజులపాటు ఈ గణన చేపట్టి వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు. అలాగే అటవీ ప్రాంతంలో కలపను తరలించినా, అటవీ జంతువులను వేటాడినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓలు భాస్కర్, సాయిప్రకాశ్, సెక్షన్ ఆఫీసర్లు రాగ్యానాయక్, సైదులు, శ్రీదేవి, కవిత, చంద్రకళ, ప్రీతి ఉన్నారు.