కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి
మిల్లర్ల సమస్యను
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
మంత్రితో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ల భేటీ
సీఎంఆర్ సేకరణకు ఎఫ్సీఐని ఒప్పించాలంటూ వినతి
సూర్యాపేట టౌన్, జూన్ 27 : కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా Hచొరవ చూపాల్సి ఉందన్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యంతో గోడౌన్లు, సీఎంఆర్తో మిల్లులు నిండిపోయాయని, ఎఫ్సీఐ కస్టమ్ మిల్లింగ్ రైస్ను తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఉదయం సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆదాని కోసం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టం, విద్యుత్ సంస్కరణలతో రైతులు, వ్యాపారులే కాకుండా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలు ప్రశాంత వాతావరణంలో దినదినాభివృద్ధి చెందుతున్నారన్నారు.
నిరంతర విద్యుత్, పుష్కలంగా నీరందుతుండడంతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి సంచలనాత్మక పథకాలతో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. గతంలో ఒక్క మిల్లు ఉన్న ఓనర్ ప్రస్తుతం రెండు, మూడు మిల్లులు ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామన్నారు. ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా వ్యాపారాలు సాగుతున్న తరుణంలో ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల సీఎంఆర్తో గోదాములు నిండి పోయాయని.. ఎఫ్సీఐ సీఎంఆర్ను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డికి విన్నవించుకున్నారు. మిల్లర్ల సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి సీఎంఆర్ కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ భేటీలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, జనరల్ సెక్రటరీ రేపాల భద్రాద్రి రాములు, గౌరవాధ్యక్షుడు కందుకూరి మహేందర్, నల్లగొండ సెంటర్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, నకిరేకల్ సెంటర్ అధ్యక్షుడు కన్మంతరెడ్డి కేశవరెడ్డి, మిర్యాలగూడెం, సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, బోనాల రవీందర్, భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ జనరల్ సెక్రటరీ నాగభూషణం, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దాదాపు150 మంది రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.