రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, సాగు నీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కరువు జిల్లాగా ఉన్న నల్లగొండ నేడు వరిసాగులో రికార్డు సృష్టించిందని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. గతంలో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు మన దగ్గరికే ఇతర రాష్ర్టాల కార్మికులు వస్తున్నారని తెలిపారు.
మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నదని, దేశంలో ఆకలి చావులు పెరిగాయని అన్నారు. బీజేపీ అరాచక రాజకీయాలను ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉందని, ప్రజలంతా సీఎం కేసీఆర్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరి పింఛన్లు, ఉచిత కరంట్, రైతుబంధు, రైతు బీమా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కరంట్ ప్రైం చార్జీల పేరుతో కేంద్రం అడ్డగోలు దోపిడీకి సిద్ధమైందని, ఇదంతా మోదీ దోస్త్ అదానీ కోసమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు.
– మోత్కూరు, మార్చి 31
మోత్కూరు, మార్చి 31 : రైతు గర్వంగా బతుకాలన్నదే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని.. స్వరాష్ట్రంలో తాగు, సాగునీరు, నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరు పట్టణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వమే శరణ్యమన్నారు. గతంలో కరువు జిల్లాలుగా పేరున్న నల్లగొండ, మహబూబ్నగర్ ఇప్పుడు వరి దిగుబడిలో రికార్డు సృష్టించాయని.. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీరు, భూగర్భ జలాల పెరుగుదలతో బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాయని తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో యేటా 15 నుంచి 20 లక్షల మంది వలసలు పోయేదని, ఇప్పుడు సుమారు 30 లక్షల మంది కర్ణాటక, కర్నూల్ నుంచి మన దగ్గరికి ఉపాధి కోసం వస్తున్నారని అన్నారు. విద్యుత్ సరఫరాకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నా రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన కరంట్ అందిస్తున్నామని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నదని, మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన రూ.30వేల కోట్లను అడ్డుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమం ఉసేత్తని ఆ పార్టీలకు రైతు బంధు, ఆసరా పింఛన్లు డబుల్ చేస్తామని చెప్పే ధైర్యం లేదన్నారు. దేశంలో ఆకలి చావులు బాగా పెరిగినా పట్టించుకోని మోదీ.. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిక్కు లేడని, దేశానికి సక్కగా లేని ప్రధాని మోదీ దిక్కయ్యాడని అన్నారు. మోదీ అరాచక రాజకీయాలను ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని దేశ ప్రజలంతా నమ్ముతున్నారని, అందుకే సీఎం కేసీఆర్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గుర్ర కవిత దంపతులు, పాటిమట్లకు చెందిన బండ విజయ్రెడ్డి, దాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డికి, ఎమ్మెల్యే కిశోర్కుమార్కు మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను యాదవ్ ఆధ్వర్యంలో గొంగడి కప్పి గొర్రెపిల్లతో సన్మానించారు. నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి గులాబీ తల పాగ, నాగలి, ఖడ్గం బహూకరించి సన్మానించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రతి గడపకూ చేర్చాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని తెలిపారు. మండలంలో 5,300 మందికి నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటి వరకు 982 మంది లబ్ధిదారులకు రూ.10 కోట్లు, 10 వేల మంది రైతులకు రైతు బంధు ద్వారా రూ.120 కోట్ల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. 129 మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబాలకు రైతు బీమా కింద రూ.6.45 కోట్ల ఇన్సూరెన్స్ అందిందని చెప్పారు.