నల్లగొండ : సాగునీటి కోసం( Irrigation water) నల్లగొండ నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉదయ సముద్రం ఎస్ఎల్బీసీ కింద ఉన్న మామిడాల, పజ్జుర్, ఇండ్లుర్, గోరెంకల పల్లి, మండలాపురం గ్రామాల్లో గత 20 రోజులుగా సాగు నీరు అందక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా చేపట్టారు. ఎస్ఎల్బీసీ కింద ,D 40, L.11 తూముల ద్వారా తమకు సాగు నీళ్లు వచ్చేవని, కానీ ఇరిగేషన్ అధికారులు తమకు నీళ్లు ఇవ్వకుండా తూములకు సీల్ వేసి వేరే ప్రాంతానికి నీళ్లు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమీడాల గ్రామంలోని L 11 తూము వద్ద 6 గ్రామాల రైతులు ధర్నాకు చేపట్టారు. తూముల సీల్ తొలగించి తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని వారు వేడుకున్నారు. ఇరిగేషన్ అధికారులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి రైతులను వేదింపులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నా తమకు ఒరిగింది శూన్యం అని రైతులు మండిపడ్డారు.