జిల్లావ్యాప్తంగా వరుణుడి అరంగేట్రం
బుధవారం పలుచోట్ల మోస్తరు వర్షం
దేవరకొండ డివిజన్లో భారీ వాన
అత్యధికంగా డిండిలో 80.4 మిల్లీమీటర్ల వర్షపాతం
నల్లగొండ జిల్లాలో సగటున 20.6..
సూర్యాపేట జిల్లాలో 2.2 మిల్లీమీటర్లు
ఊపందుకుంటున్న వ్యవసాయ పనులు
పలుచోట్ల విత్తనాలు వేస్తున్న రైతన్నలు
నైరుతి ప్రవేశంతో సమృద్ధిగా వర్షాలకు అవకాశం
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని కొంతమేర చల్లబడింది. బుధవారం ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా డిండిలో 80.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దేవరకొండ డివిజన్లో పలుచోట్ల వాగుల్లో వరద సాగింది. నల్లగొండ జిల్లాలో మెజార్టీ మండలాల్లో వర్షప్రభావం కనిపించగా సూర్యాపేట జిల్లాలో 11 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలతో మెట్టప్రాంతాల్లోని రైతులు పలుచోట్ల విత్తనాలు వేయడంలో బిజీ అయ్యారు. నైరుతి రుతు పవనాల ప్రవేశంతో త్వరలోనే జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నల్లగొండ ప్రతినిధి, జూన్15 (నమస్తే తెలంగాణ) : గతంలో రోహిణి కార్తెలోనే సరైన వర్షాలు కురిస్తే రైతులు విత్తనాలు విత్తేవారు. కానీ ఈ సీజన్లో రోహిణిలో ఎండలు దంచికొట్టగా వానల జాడే లేకుండా పోయింది. మృగశిర కార్తెలో వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తుండగా రెండు రోజులుగా కొంత ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం రాత్రి జిల్లాలోని పలుచోట్ల వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం నుంచి చల్లని గాలులతో మొదలై బుధవారం ఉదయానికి పలు మండలాల్లో వరుణుడు కరుణించాడు. దీంతో నల్లగొండ జిల్లాలోని 25 మండలాల్లో, సూర్యాపేట జిల్లాలోని 11 మండలాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో సగటు వర్షపాతం 20.6 మిల్లీమీటర్లు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 2.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అయితే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్ పరిధిలో ఈ సీజన్లో తొలిసారిగా భారీ వర్షం కురిసింది. డిండిలో అత్యధికంగా 80.4 మి.మీ., దేవరకొండలో 75.3, కొండమల్లేపల్లిలో 64.3, చందంపేటలో 57.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని పలు వాగుల్లో జలకళ మొదలైంది. పత్తి, కంది లాంటి మెట్ట పంటల సాగు ఊపందుకోనుంది. ఇక నిడమనూరులో 44.3 మి.మీ., హాలియాలో 44.1, నేరడుగొమ్ములో 32.8, చింతపల్లిలో 31.3, పీ.ఏ.పల్లిలో 30.3, అడవిదేవులపల్లిలో 23.5, పెద్దవూరలో 22.4, నాంపల్లిలో 20.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లోనూ పంటల సాగుకు అనువైన వాతావరణం నెలకొంది. ఐదు మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ సీజన్లో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 42.01మి.మీ. కాగా 40 మిల్లీమీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
సూర్యాపేట జిల్లాలో సగటు వర్షపాతం 2.2 మి.మీ. నమోదు
సూర్యాపేట జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందారు. జిల్లాలో బుధవారం 2.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మొత్తం 23 మండలాలకు గానూ 11 మండలాల్లో వర్షప్రభావం కనిపించింది. భారీ వర్షాలు ఎక్కడా కురువకపోయినా… చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అత్యధికంగా చింతలపాలెం మండలంలో 16.5, మేళ్లచెర్వులో 15.5, మఠంపల్లిలో 6.7, కోదాడలో 3.4, చివ్వెంలలో 2.2, పెన్పహాడ్లో 2.0, హుజూర్నగర్లో 1.7, పాలకవీడులో 0.5, నాగారంలో 0.4, గరిడేపల్లి, నేరేడుచర్లలో 0.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మాత్రం వర్షం జాడ కానరాలేదు. అయితే ఈ వర్షాలతో పంటల సాగుకు ఉపక్రమించే పరిస్థితి లేకపోవడంతో వరుణుడి కరుణ కోసం రైతులు వేచి చూస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రిభువనగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం చిరు జల్లులతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ప్రభావం కనిపించగా సాయంత్రం 5 గంటల తర్వాత వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసింది. జిల్లాలోని మొత్తం 17 మండలాలకు గానూ 8 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వలిగొండలో 21మిల్లీమీటర్లు, మోటకొండూర్లో 14.5 మి.మీ, గుండాలలో 14.8, ఆలేరులో 3.2, చౌటుప్పల్లో 6.0, రామన్నపేటలో 2.3, అడ్డగూడూరులో 1.5, ఆత్మకూర్(ఎం)లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం సాయంత్రం వేళల్లో నమోదయ్యాయి. అయితే ఈ వర్షాలకు సాగుకు ఉపక్రమించే పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంచి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఆనందం కలిగిస్తున్నది.
ముమ్మరంగా సాగు పనులు
కేతేపల్లి, జూన్ 15 : మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పత్తి గింజలు వేయడం మొదలు పెట్టారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు.
దేవరకొండలో వర్షం
దేవరకొండ/దేవరకొండ రూరల్/కొండమల్లేపల్లి, జూన్ 15 : దేవరకొండ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో భారీగా వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవరకొండ మండలంలో 94 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో వట్టిపోయిన వాగులు నీటితో కళకళలాడాయి. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు నాటడం ప్రారంభించారు. దేవరకొండ, చందంపేట, డిండి, పీఏపల్లి, చింతపల్లి, నేరేడుగొమ్ము మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
పెద్దవూర : మండలంలో బుధవారం తెల్లవారుజామున మండలంలోని పెద్దగూడెం, శిర్సనగండ్ల, బసిరెడ్డి పల్లి, బట్టుగూడెం, వెల్మగూడెం గ్రామల్లో మోస్తరు వర్షం కురిసింది. దాంతో రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు.