నల్లగొండ సిటీ, ఏప్రిల్ 12 : ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారని వాపోతూ కొందరు రైతులు జి.యడవెల్లిలో కనగల్ – చండూరు రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కనగల్ మండలంలోని జి.యడవెల్లి గ్రామ ఐకేపీ సెంటర్లో సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకుండా తేమ పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు.
అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి మేరకు ఐకేపీ కేంద్ర నిర్వాహకులు పని చేస్తున్నారని, సీరియల్ లేకుండా ఇష్టానుసారంగా ధాన్యం కాంటా వేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిర్వాహకులు కూడా సదరు నాయకుడి వద్దకు వెళ్లి అడగాలని సూచిస్తున్నారన్నారు. కాగా, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొందరు రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రం నుంచి తీసుకొని వెళ్లిపోయారు.
ఐకేపీలో పోసిన ధాన్యాన్ని సీరియల్ లేకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారివి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నాది 42వ సీరియల్ నంబర్ ఉన్నప్పటికీ నా ధాన్యం కాంటా వేయకుండా, 182వ నంబర్ వారి ధాన్యాన్ని కాంటా వేశారు. ఈ విషయాన్ని సెంటర్ వారిని అడిగితే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్లి అడగమంటున్నారు.
– గడ్డం శ్రావణ్, రైతు
కొందరు రైతులు ఐకేపీ సెంటర్లో కాకుండా పక్కన ప్రైవేట్ స్థలంలో ధాన్యాన్ని పోశారు. వారి ధాన్యానికి పీఏసీఎస్ నిర్వాహకులు నంబరు కేటాయించారు. కానీ.. ఆ రికార్డును ఐకేపీకి ఇవ్వలేదు. దాంతో సీరియల్ మారింది. అయినా కొనుగోలు చేస్తున్నాం. ముగ్గురు, నలుగురు రైతుల ధాన్యం మాత్రమే పక్కన ఉన్నాయి. ఈ రోజు రాత్రి వారివి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ లోపు ధాన్యాన్ని తీసుకుపోయారు. ఇక్కడ రాజకీయం ఏమీ లేదు.
– సంకు హరి, ఏపీఎం