నేరేడుచర్ల, ఫిబ్రవరి 24 : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాక అన్నదాతలు గోస పడుతున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి కరువు తాండవించే పరిస్థితులు నెలకొన్నాయి. ఎడమ కాల్వకు నీటి విడుదల చేయకపోవడం, వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువులు జలకళతో ఉట్టిపడగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండిపోతున్నాయి.
హుజూర్నగర్ నియోజకవర్గంలో గత సంవత్సరం యాసంగిలో 1,36,800 ఎకరాల్లో వరి సాగు చేయగా. ఈ సీజన్లో 90,250 ఎకరాలకు పడిపోయింది. సాగర్ ఆయకట్టు కింద ప్రభుత్వం పంటలు వేసుకోవద్దని సూచించింది. కానీ సాగర్ను నమ్ముకొని సాగు చేసిన వారికి ఎప్పుడూ నష్టం రాలేదని రైతుల నమ్మకం. అదే విశ్వాసంతో నాట్లు వేశారు. సాగర్ నీటిని చివరి దశలోనైనా విడుదల చేస్తారని ధైర్యంగా ముందుకు సాగారు. కొంత మంది రైతులు, బోర్లు, బావుల ద్వారా కూడా సాగు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ సాగర్ డ్యామ్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీలో 505 అడుగులు ఉన్నప్పటికీ తడుల విధానంగానైనా నీటిని విడుదల చేసి రైతులకు అండగా నిలిచింది. ప్రస్తుతం 520 అడుగులు సాగర్లో నీరు ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడంలేదు. తీవ్రమైన ఎండలు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే భూగర్భ జలాలు గరిష్ఠ స్థాయిలో అడుగంటి పోయాయి. దాంతో వరి పంటలు పూర్తిగా ఎండిపోయి అన్నదాతకు తీరని నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
వరి సాగు కోసం రైతులు ఎకరానికి సుమారు రూ. 30వేల నుచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి పోగా ఆరుగాలం కష్టపడ్డ శ్రమ వృథా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు మూడు ఎకరాల సాగుచేసిన రైతులకు ఒక్క ఎకరాకు కూడా సక్రమంగా నీరదండం లేదని వాపోతున్నారు. ఈ సమయంలో సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే కొద్దిపాటి పంట అయినా చేతికొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలోచించి సాగర్ నీటిని పాలేరు రిజర్వాయర్కు విడుదల చేసిన విధంగానే జాన్పహాడ్ మేజర్కు కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.
సాగర్ నీరు రాకపోవడంతో పొలాలను రక్షించుకోవడం కోసం రైతులు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యాసంగిలో సీజన్లోనే సుమారు 1500 నుంచి 1800 బోర్లు వేసినట్లు సమాచారం. లక్ష రూపాయలు ఖర్చు చేసి సుమారు ఒక్కొక్క బోరు 200 ఫీట్లకు పైగా వేసినప్పటికీ సరపడా నీరు పోయడం లేదు. దాంతో సాగు చేసిన వరి పంట ఎండే పరిస్ధితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. సాగర్ నుంచి నీటి విడుదల కూడా లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకున్న కొద్ది పొలం మొత్తం నీళ్లు లేక ఎండిపోయింది. ప్రభుత్వం సాగర్ నీటిని విడుదల చేస్తే పంటలకు చేతికొస్తాయి.
– పెద్దపంగ సామేలు, రైతు, సోమారం, నేరేడుచర్ల మండలం
నాకున్న మూడు ఎకరాలలో బోర్లు, బావులను నమ్ముకొని వరి సాగు చేస్తే పూర్తిగా ఎండిపోయింది. గతంలో ఇట్ల లేకుంటే. గత ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు ఇచ్చింది. ఎండిపోయిన పంటలను సర్వే చేయించి ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించాలి. లేకుంటే అప్పులే మిగులుతాయి.
– కె.రాంరెడ్డి, రైతు, కొండాయిగూడెం, గరిడేపల్లి మండలం