నాటి రికార్డుల్లో ఉన్న 31కాలమ్స్తోనే అష్ట కష్టాలు పడ్డం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ఆ ఇబ్బందులు తప్పినయ్.. ధరణి ఎత్తేసి అదే రికార్డులు తీసుకొస్తే నిత్యం అన్నదమ్ములతో పాటు ఇరుగు పొరుగు వారితో కూడా భూముల పంచాయితీ తప్పదు. నిత్యం గొడవలు, పోలీస్టేషన్లు, కోర్టు కేసులు మొదలవుతాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములకు భద్రత కల్పించే ధరణితో పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్నామని..ప్రస్తుతం భూముల రేట్లు పెరిగినప్పటికీ రికార్డులు పక్కాగా ఉండడంతో ఏ గోలా లేదంటూ ధరణి తీసి పాత పద్ధతి పెడితే ఇప్పుడున్న భూముల రేట్లకు కబ్జాదారులు ఎక్కువై.. రికార్డులు తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కంప్యూటర్ కాలంలో కూడా కాంగ్రెస్ వాళ్లు పాత పద్దతే పెడ్తం అనడం.. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్లకు రైతుల పట్ల ప్రేమ లేదని, అలాంటి వాళ్లను మళ్లీ అధికారంలోకి రానిచ్చేది లేదని ముక్తకంఠంతో చెబుతున్నారు.
– నల్లగొండ, నవంబర్ 29
ధరణి తీసేస్తే సర్వే నెంబర్లు వెతుకోవాలి
ధరణి రాకముందు గ్రామాల్లో వీఆర్వోలు సర్వే నెంబర్లు మార్చి రైతులను చానా తిప్పలు పెట్టిండ్రు. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ముందుగా పహాణీ తీస్తే సర్వే నెంబర్లు మారేవి. భూమి ఒకచోట సర్వే నెంబర్ మరోచోట కావడంతో రైతులు పనులు వదులుకొని వీఆర్వోల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పైసలు ఖర్చు పెట్టుకున్నా, నెలల తరబడి తిరిగినా పని కాకపోయేది. వీఆర్వోలు తమ ఆదాయం కోసం చదువురాని మా లాంటి వారి భూముల సర్వే నెంబర్లు మార్చడంతో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. రైతు వేలు పెట్టకుండా ఒకరి భూమిని మరొకరికి రాయడం ఏ అధికారి వల్లా అయితలేదు. రైతు ఎకడున్నా తన భూమిని సెల్ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైనా రైతులకు మంచి చేసేవారిని కోరుకుంటారు కానీ.. ఆగం చేయాలనుకుంటే కాంగ్రెస్ను ఖతం చేస్తారు.
– బోరువ ఎల్లయ్య, కలకొండ, నాంపల్లి మండలం
ధరణి లేకుంటే పైరవీకారులదే రాజ్యం
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములకు రక్షణ లేకుండా ఉండేది. దళారులు డబ్బులు తీసుకుని అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకుని నిజమైన రైతులను ఇబ్బందులకు గురిచేసేవాళ్లు. పైరవీ కారుల రాజ్యం నడిచేది. సీఎం కేసీఆర్ ధరణి సైట్ పెట్టి భూములకు భద్రత కల్పించడంతోపాటు కొత్త పాసు పుస్తకాలు అందజేశారు. ఇప్పుడు అధికారుల చుట్టూ తిరగడం లేదు. ఉన్న సమస్యలు తీరాయి. దాంతోపాటు రైతు బంధు పైసలు డైరెక్టుగా ఖాతాలో పడుతున్నాయి. ధరణి లేకుంటే రైతులు అధికారుల చుట్టూ తిరుగుడైతది. పనులు కూడా కావు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు మంచిగా ఉన్నది. ధరణితో వ్యవసాయ భూముల పట్టా మార్పిడి తొందరగా అవుతుంది. కాంగ్రెస్ వస్తే రైతులు మళ్లీ ఇబ్బందులు పడుతారు.
– వల్లూరి లింగయ్య, వెల్మకన్నె, గట్టుప్పల్ మండలం
పట్వారీ వ్యవస్థతో రైతులకు గోసనే..
కాంగ్రెస్ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటే పట్టించుకునేవారే లేకుండె. రెవెన్యూ అధికారులకు, రైతులకు మధ్య బ్రోకర్లు ఉంటేనే పని జరిగేది. ఆ ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ధరణితో భూ సమస్యలు లేకుండా పట్టాదారులకు, కౌలుదారులకు ఎటువంటి గొడవలు లేకుండా చేసిండు. రైతుకు ఏ సమస్య వచ్చినా నేరుగా తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించుకునేలా వీలు కల్పించిండు. కానీ.. ప్రశాంతంగా ఉన్న రైతుల మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నది. ధరణిని రద్దు చేసి పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. దాంతో పటేల్, పట్వారీ వ్యవస్థ మళ్లీ మొదలై రైతులకు గోస తప్పదు. కాంగ్రెసోళ్లను నమ్మితే రైతుల బతుకులు ఆగమే. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తది. ధరణి పోర్టల్ను తీసేస్తామంటున్న కాంగ్రెస్ను బొందపెట్టాలి.
– గంట సైదులు, రైతు, లక్ష్మీదేవిగూడెం, వేములపల్లి మండలం
ధరణితో రైతులకు ఎంతో భద్రత
ధరణి లేని సమయంలో భూముల విషయంలో అనేక గొడవలు జరిగేవి. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే పనులు వదులుకోని పోయేది. ఆఫీసుల కాడ దళారులకు అడిగినంత డబ్బులు ఇచ్చేది. పైసలు పోయేది కానీ.. పనులు కాకపోయేవి. సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో భద్రత ఏర్పడింది. భూ రికార్డుల పరంగా ఉపయోగపడుతుంది. ధరణి వచ్చాక ఖర్చు లేకుండా భూముల రిజిస్ట్రేషన్ అవుతుంది. తాతలు, తండ్రుల కానుంచి కాని భూముల పట్టాలు ధరణి వచ్చినంక పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. మీసేవలో అప్లయ్ చేసుకున్న ఒక్క రోజులోనే తాసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి వెంటనే పట్టా పాస్బుక్ ఇస్తుండ్రు. దళారుల వ్యవస్థ పోయింది. అమ్మేటోళ్లకు, కొనేటోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరణి పోర్టల్ మేలు చేస్తుంది. మళ్లీ కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటున్నది. ధరణి పోతే రైతులకు తిప్పలు తప్పవు.
– పచ్చిపాల అక్కులు, రైతు, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి మండలం
మా డబ్బులు కౌలు రైతుకు ఎట్లిస్తరు
కౌలుదారుల చట్టం తీసుకొస్తామని, కౌలు రైతులకు రైతుబంధు డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్నడు. అసలు భూ యజమానులను వదిలేసి కౌలు రైతులకు డబ్బులిచ్చుడేందో వాళ్లకే ఎరుక. ఇదంతా రైతుకు, కౌలు రైతుకు మధ్య తగువు పెట్టెందుకే కానీ వాళ్లను ఆదుకోవడానికి కాదు. రికార్డుల్లో కౌలురైతు పేరు పెట్టడం, కౌలు రైతుకు అగ్రిమెంట్ ఇవ్వాలనే నిబంధనలతో భూమి యజమానులకు ఇబ్బందులు తప్పవు. ధరణిని ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. పోయిన పాట్వరీ వ్యవస్థను తీసుకొచ్చి మంచిగా బతుకుతున్న రైతుల నోట్ల మట్టి కొట్టడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఇప్పుడున్న ధరణితోనే మాకు ఎటువంటి సమస్యలు లేవు. మళ్లీ అధికారుల సుట్టూ తిరిగే కాలం మా కొద్దు. ధరని తెచ్చిన సీఎం కేసీఆర్కే మద్దతిస్తాం.
– వడ్లపల్లి శశిపాల్రెడ్డి, ఏనెమీదిగూడెం, పెద్దవూర మండలం