సూర్యాపేట, జూన్ 1 : అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో 99.16 శాతం మందికి కంటి పరీక్షలు చేశారు. 141 వార్డుల్లో 157 క్యాంపులు నిర్వహించి 110.56 శాతం పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 కంటి వెలుగు టీంలతో 616 క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 628 క్యాంపులు నిర్వహించారు. ఇందులో 1,47,564 మందికి కంటి అద్దాలు అందించారు.
70శాతం మందికి కంటి సమస్యలు
సూర్యాపేట జిల్లాలో 5,00,770 మందికి కంటి పరీక్షలు చేయగా దాదాపు 3,53,074 మంది(70.51 శాంతం) వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. 2023 జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలు, 141 మున్సిపల్ వార్డులలో కంటి వెలుగు క్యాంప్లు ఏర్పాటు చేశారు. 60 టీంలతో 616 క్యాంప్లు ఏర్పాటు చేసి 5 లక్షల మందికి పరీక్షలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి మొదటి విడుత కంటి వెలుగును ప్రారంభించింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 5,76,231 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,04,574 మందికి కంటి అద్దాలు అందించారు. 50,425 మందికి కంటి ఆపరేషన్ల కోసం డాక్టర్లు రెఫర్ చేయగా అందులో 236 మందికి ఆపరేషన్ చేశారు.
5 లక్షల మందికి పరీక్షలు
జిల్లాలో 10 లక్షల జనాభా ఉండగా 8 లక్షల మంది 18 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. రెండో విడుతలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు చేయగా.. వీరిలో పురుషులు 2,38,098 మంది, మహిళలు 2,62,,083 మంది, ఇతరులు 442 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 92,537, ఎస్టీలు 70,121, బీసీలు 2,78,188, ఓసీలు 53,452, మైనార్టీలు 6,325 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 1,47,564 మందికి కంటి అద్దాలు అందించగా వీటిలో 85,356 మందికి రీడింగ్ అద్దాలు అందించారు. 62,208 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమవగా ఇప్పటి వరకు 47,753 మందికి అందించారు. మిగితా వారికి త్వరలోనే ఇవ్వనున్నారు.
నల్లగొండ జిల్లాలో 8.10 లక్షల మందికి పరీక్షలు
మిర్యాలగూడటౌన్ : నల్లగొండ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నేటితో ముగియనున్నదని కంటివెలుగు క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ జి. సుధీర్కుమార్ తెలిపారు. గురువారం మిర్యాలగూడ డివిజన్లోని కంటివెలుగు శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 18న జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించి అనుకున్న తేదీ కంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. 844 గ్రామపంచాయతీలు, 182 వార్డుల్లో 75 టీమ్లతో కార్యక్రమాన్ని కొనసాగించి దాదాపు 8.10 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు 1.10 లక్షల మందికి రీడింగ్ గ్లాస్లు, 67వేల మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందించినట్లు తెలిపారు. వేసవిలోనూ ప్రజలు కంటివెలుగు శిబిరాలను ఉపయోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. కార్యక్రమంలో నిరంతరాయంగా సేవలు అందించిన 75 టీమ్ల వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయన వెంట ఆప్తాల్మిక్ అధికారులు వెంకటేశ్వర్లు, మాతంగి వెంకన్న ఉన్నారు.