నేరేడుచర్ల, మార్చి 27 : ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలు సరిపోలక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయడం ఈజీఎస్ సిబ్బందికి కష్టంగా మారింది. సూర్యాపేట జిల్లాలో 6,346 మంది కూలీలకు ఈ సమస్య ఏర్పడగా, వీరు ఉపాధి హామీ పనులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అటు చేసిన పనికి డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో పడడం లేదు.
దీంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. అయితే.. జాబ్ కార్డులో ఉన్న విధంగా ఆధార్ కార్డులో పేరును సరి చేసుకోవడమే ప్రస్తుతమున్న ఏకైక మార్గంగా కనిపిస్తున్నది. కానీ.. ఆధార్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి కూలీలు ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 3,45,553 మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా ఇప్పటి వరకు 3,39,207 మంది కూలీల అథెంటిఫికేషన్ పూర్తయింది. మిగిలిన 6,346 మంది వివరాలు బ్యాక్ అకౌంట్కు అనుసంధానం కాకపోవడంతో పనులకు దూరంగా ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ఈ సమస్య పరిష్కారం కావచ్చని వారు పేర్కొంటున్నారు.
ఉపాధి హామీ జాబ్ కార్డుకు, ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు కొంత వ్యత్యాసం ఉండడంతో జిల్లాలో వేల మంది కూలీలకు అనుసంధాన సమస్య తలెత్తింది. ఇంటి పేరు లేకపోవడం, పేరులో అక్షరం వేరుగా ఉండడం వంటి సమస్యలు ఉంటే ఆన్లైన్ కావడం లేదు. బ్యాంకు అకౌంట్ సక్రమంగా లేకపోయిన వారి పేర్లు కూడా నమోదు కావడం లేదు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించనున్నారు. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వివరాలు అనుసంధానం కానివారు జిల్లాలో సుమారు 6,346 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు ఈ వేసవిలో పనులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు.