60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఎన్నికల్లో పోటీ జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 2014కు ముందు ఎంతో గోస పడ్డామని, బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నామని, అందుకే ప్రజలంతా గులాబీ జెండాను గుండెల నిండా నింపుకొని
స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
జిల్లా కేంద్రంలో బుధవారం సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఓటు వేసిన తర్వాతే ప్రజల తలరాతలు మారాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని ఇల్లు లేదని తెలిపారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 15 : ఉమ్మడి పాలనలో అరయేండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధి, సంక్షేమానికి మధ్యే పోటీ అని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సూర్యాపేట మండలం, ఆత్మకూర్ (ఎస్) మండలాల నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన సుమారు 340 మంది బీఆర్ఎస్లో చేరగా వారందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు విపక్షాల పాలనలో ఎంతో గోస పడ్డామని.. నేడు బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నట్లు తెలిపారు. అందుకే ప్రజలంతా గులాబీ జెండాను గుండెల నిండా నింపుకుని అభిమానం చాటుతూ స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు.
యావత్ దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంచలనాత్మకంగా ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అందరికీ కొండంత అండగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లాలో పదేండ్లుగా అన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలతో ఎవరూ ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్కు ఓటు వేసినంకనే ప్రజలందరి తలరాతలు మారాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని పాంతాల్లో లబ్ధిపొందని ఒక్క ఇల్లుందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో బడా నాయకులం అని చెప్పుకుంటున్న వారు గతంలో చేసిన రౌడీ రాజకీయాలను, సిండికేటు దందాలను ఇక్కడి ప్రజలెప్పటికీ మరిచిపోలేరన్నారు. నాడు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా నీరు పారాల్సిన కాల్వలు, చెరువులు ముళ్లకంపలతో దర్శనమిచ్చేవని.. దాంతో వ్యవసాయం సరిగ్గా సాగక భయానక వాతావరణంలో వలస వెళ్లిన ఘటనలు మార్చిపోగలమా అన్నారు.
నేడు తాగు, సాగుకు పుష్కలంగా నీరందుతూ వాగులు, చెరువులు అలుగులు పోస్తుంటే.. నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయం పండుగలా చేసుకుంటూ రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలు ధీమాగా జీవిస్తున్నట్లు చెప్పారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కు జై కొడుతూ గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ అభివృద్ధి నిరోదక పార్టీలేనని.. వాటికి ఓటేస్తే మళ్లీ తెలంగాణలో కారు చీకట్లు తప్పవని, కారు గుర్తుకు ఓటేస్తేనే తమ జీవితాల్లో మరింత వెలుగులు నిండుతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
ఆత్మకూర్ (ఎస్) మండలం నంద్యాలగూడెంకు చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు తంగెళ్ల సైదిరెడ్డి తన అనుచరులతో పాటు బీజేపీకి చెందిన 250 మంది, అలాగే సూర్యాపేట మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరెగూడెం ఉప సర్పంచ్ తొట్ల నాగరాజు, వార్డు మెంబర్ బండ్ల భూషణంతో పాటు బీఎస్పీకి చెందిన 90 మంది మొత్తం 340 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రామ్మూర్తియాదవ్, శ్రీనివాస్, చంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్నాయుడు, స్వాతీరాఘవరెడ్డి, తంగెళ్ల వీరారెడ్డి, మాలి అనంతరెడ్డి, వెంకట్రెడ్డి, చింతలపాటి మధు పాల్గొన్నారు.