నీలగిరి, జనవరి 28 : నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఫిబ్రవరి 5న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8న బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. అదేరోజు వైస్ చైర్మన్గా ఉన్న అబ్బగోని రమేశ్ను ఇన్చార్జి చైర్మన్గా నియమిస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. బీఆర్ఎస్కు చెందిన 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్కు మద్దతు తెలుపడంతో ఆ పార్టీకి చెందిన చైర్మన్ సైదిరెడ్డి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అవిశ్వాసం నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది.
బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకునేలా అప్పటికే విప్ జారీ చేసి సంబంధిత కాపీలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. అవిశ్వాసంలో మొత్తం 15 మంది బీఆర్ఎస్ సభ్యులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ను జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్వర్యంలో వీడియోలో సైతం రికార్డు చేశారు. అవిశ్వాసం నెగ్గిన తరువాత వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పిస్తామని మీడియా ద్వారా చెప్పారు. కానీ.. విప్ ఉల్లంఘించిన వారిపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కొత్త చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో పటిష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లి పార్టీ నిర్ణయాలకు అతీతంగా వ్యవహరించిన వారి పదవి కోల్పోయేలా చట్టాలు రూపొందించారు. ఈ మేరకు నల్లగొండ నియోజకవర్గంలో గతంలో పగిడిమర్రి, రేగట్టె ఎంపీటీసీలు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వారిపై వెంటనే అనర్హత వేటు వేసి తిరిగి ఎన్నికలు నిర్వహించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక మున్సిపాలిటీల్లో చైర్మన్పై అవిశ్వాసాలు ప్రకటించారు. కొన్ని చోట్ల వీగిపోయినా.. నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ సందర్భంగా విప్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పలుమార్లు కలెక్టర్కు విన్నవించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీన్ని పక్కన పెట్టి చైర్మన్ ఎన్నిక కోసం రా్రష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా యంత్రాంగం సిఫార్స్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగమే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఏమిటని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.