చౌటుప్పల్, జూన్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యుత్ ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరాష్ట్రంలో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే చీకటిమయం అవుతదని, వీళ్లతో పాలన సాధ్యం కాదని గత పాలకులు విమర్శించారని అన్నారు.
దీనికితోడు ప్రత్యేక రాష్ట్రం రాగానే మరింత కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీలేరు పవర్ ప్రాజెక్ట్ను ఏపీలో కలిపిందని తెలిపారు. ఎన్ని కుట్రలకు తెరలేపినా అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందుతున్నదని గుర్తు చేశారు. గుజరాత్లో 6గంటల కరెంటు ఇస్తున్నారని, రైతులు బిల్లు కట్టకపోతే మోటర్లకు మీటర్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. 2014కు ముందు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రోజులు పట్టేదని, తిరిగొచ్చే సరికి పంట పూర్తిగా ఎండిపోయేదని గుర్తు చేశారు. అప్పట్లో నియోజవర్గంలో 5సబ్స్టేషన్లు ఉండేవని, తర్వాత వాటి సంఖ్య 12కు తెచ్చామని చెప్పారు. మరో 6సబ్స్టేషన్లకు టెండర్లు కూడా పూర్తయినట్లు తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వెన్రెడ్డి రాజు, తోకల చంద్రకళ, జడ్పీ సీఈఓలు కృష్ణారెడ్డి, ప్రేమ్కరణ్రెడ్డి, ఎంపీపీలు మోహన్రెడ్డి, పల్లె కళ్యాణి, కర్నాటి స్వామి, గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీలు పాశం సురేందర్రెడ్డి, కర్నాటి వెంకటేశం, వీరమళ్ల భానుమతి, పీఏసీఎస్ చైర్మన్లు చింతల దామోదర్రెడ్డి, జె.జంగారెడ్డి, విద్యుత్ డీఈ విజయ్భాస్కర్రెడ్డి, ఏడీఈ శ్యామ్కుమార్, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.