మునుగోడులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే జనం తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీశారు. ఎటుచూసినా జనంతో సభ ప్రాంగణం నిండిపోయింది. ఈలలు, కేరింతలతో హోరెత్తింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ‘గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క.. మునుగోడు గడ్డ..ప్రభాకరన్న అడ్డ’ అనే పాటలు సభలో ఉత్సాహ పరిచాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని చప్పట్లతో మద్దతు ప్రకటించారు.
‘గతంలో ఉప ఎన్నిక జరిగితే మీరు అందరూ మంచి తీర్పు ఇచ్చారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీల్లో 90 శాతం పనులు చేసినం. చండూరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. వంద పడకల హాస్పిటల్ నిర్మాణమవుతున్నది. మిగతా పనులన్నీ మీ కండ్ల ముందున్నయ్. ఎన్నికలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే.. ఉప ఎన్నికల్లోనూ కోరిన.. ఈ సారి కూడా కోరుతున్నా. మునుగోడులో ప్రభాకర్రెడ్డిని గెలిపించండి.. మునుగోడు అభివృద్ధి బాధ్యత నాది’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపు నిచ్చారు. ‘ఫ్లోరైడ్ గోసను తీర్చిన పార్టీ బీఆర్ఎస్సే. డిండి ద్వారా ఏడాది, ఏడాదిన్నరలోనే రెండు లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే పూర్తి బాధ్యత నాదే. అందుకే మునుగోడులో మరోసారి ఉప ఎన్నికల చైతన్యాన్ని ప్రదర్శించి బీఆర్ఎస్ను గెలిపించాలి. రోజుకో పార్టీ మారేటోళ్లకు బుద్ధి చెప్పాలి’ అని కోరారు. కాంగ్రెస్తో ఐదు గంటల కరెంట్ కూడా రాదని, ఓటు మన భవిష్యత్ను నిర్ణయిస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచించి మునుగోడు బాగు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గురువారం మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మునుగోడులో గురువారం సాయంత్రం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఆలస్యమైనా వేచి చూసిన జనం.. బీఆర్ఎస్ అధినేతకు ఈలలు, చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రసంగానికి జేజేలు పలికారు. సీఎం ప్రసంగం ప్రజలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది.
చండూరు, అక్టోబర్ 26 : ‘మునుగోడు గడ్డపైన సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియదిరిగి ఇక్కడి ప్రజల బాధలు చూసి కన్నీరు పెట్టుకుండ్రు. గతంలో ఈ ప్రాంతం వారికి పిల్లనివ్వాలంటే భయపడేవాళ్లు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే మునుగోడుకు మంచి నీళ్లు ఇవ్వాలని తలిచి ముఖ్యమంత్రి కాగానే చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ ప్రారంభించారు. చర్లగూడెం ప్రాజెక్టు కడుతుంటే ఓర్వలేకపోయిన వాళ్లు అనేక కేసులు పెట్టారు. అన్నింటినీ తిప్పికొట్టి నేడు ప్రాజెక్టు పనులు కొనసాగేలా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండేవాడిగా నన్ను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు. 2018లో కల్లబొల్లి మాటలు చెప్పి ఒక కొబ్బరికాయతో 100 పనులు అవుతాయని అబద్ధపు ప్రచారంతో గెలిచి ప్రజలను మోసం చేసిండు .
రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయిన ఆయన.. ఇప్పుడు కర్ణాటకలో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్లోకి పోతున్నడు. ప్రజా సంక్షేమానికి కాదు.. ఆయన కాంట్రాక్టుల కోసమే పనిచేస్తాడు. ఉప ఎన్నికల్లో ప్రజలు అన్నీ గ్రహించి మళ్లీ నన్ను గెలిపించిండ్రు. అప్పుడు చెప్పిన హామీలన్నీ అమలు చేసుకున్నాం. కారును గెలిపిస్తే కారు నిండా నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ఇచ్చారు. మునుగోడు అభివృద్ధికి నేను అడిగిన నిధులను సీఎం కేసీఆర్ ఇచ్చారు. చండూరు రెవెన్యూ డివిజన్ చేశారు. సుమారు రూ.570 కోట్ల నిధులు ఇచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తకువ సమయంలో అన్ని పనులను ప్రారంభించుకున్నాం. అందులో కొన్ని పూర్తి చేసుకున్నాం. తకువ సమయం ఉన్నందున పనులన్నీ పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయాం. మరోసారి అవకాశం ఇస్తే తుమ్మలపల్లి రామలింగేశ్వరస్వామి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా రక్తం దార పోస్తా. కేసీఆర్, మంత్రుల దీవెనలతో అభివృద్ధి చేస్తా. నా తుది శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా’.
– బీఆర్ఎస్ అభ్యర్థి,
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్26(నమస్తే తెలంగాణ) : మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం వచ్చే సరికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభ స్థలం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే సభా ప్రాంగణం నిండడం మొదలుకాగా సాయంత్రం ఆరు గంటల వరకు సీఎం కేసీఆర్ రాక కోసం ఎంతో ఓపికతో వేచి చూశారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. విపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ… మునుగోడు అభివృద్ధి వివరిస్తూ… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేస్తూ సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. నల్లగొండ జిల్లా చైతన్యాన్ని, కమ్యూనిస్టు ఉద్యమ చైతన్యాన్ని, ఉప ఎన్నికల స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని కోరుతూ…. పనికిమాలిన, డబ్బుమదం, అహంకారంతో రోజుకో పార్టీ మారేటోళ్లకు బుద్ధి చెప్పాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం సభకు హైలెట్గా నిలిచింది. మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మునుగోడులో ఫ్లోరైడ్ గోస తీర్చిన పార్టీ బీఆర్ఎస్నేని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ‘అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ 50, 60 సంవత్సరాలు పాలించినా… ఇక్కడ నడుములు వంగి పోయి సచ్చిపోయేదాకా చూసిరు తప్ప… ప్లోరైడ్ నివారణ చేయలే. బీజేపీ ప్రధాని మంత్రి అటల్ బీహార్ వాజ్పేయి ముందు ఇక్కడి నుంచి ఉద్యమకారులు అంశులస్వామి అనే పిల్లోడిని టేబుల్ మీద పండేసిన దానికి నివారణ దొరకలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఫ్లోరైడ్ నీళ్ల గోస ఏ విధంగా పోయిందో మీ అందరికి తెలుసు’ అని కేసీఆర్ వివరించారు. ‘బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి పదేళ్లయిన సందర్భంలో..ఎన్నికలు వస్తే..24 ఏళ్ల కిందట పత్తాలేని నాడు.. గొడగొడ ఏడ్చిన నాడు.. పంటలు ఎండిపోయిన నాడు… ఫోరె్లైడ్ తో నడుములు వంగిపోయిన నాడు.. ఎవ్వడూ పట్టించుకోలేదు ఇవ్వాళ మాట్లాడేటోళ్లంతా ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. ఆనాడు ఎక్కడెక్కడో ఉన్నోళ్లు… ఎవ్వళ్లెవ్వళ్ల బూట్లు మోసినోళ్లు… ఇయ్యాల నామీద చాలెంజ్ చేస్తుండ్రు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నాడు ఫ్లోరైడ్ బాధ ఉంటే నేనే పాట రాసిన ఎమాయేనా నల్లగొండ …ఎడుపే నీ గుండె నిండు అని చెప్పి ఆ రోజు చైతన్యం చేసే ప్రయత్నం చేసిన అని కేసీఆర్ మునుగోడు ప్రజలకు గుర్తు చేశారు.
‘ప్రజలకు డెవెలప్మెంట్ కావాలి. సాగు నీళ్లు రావాలే. తాగు నీళ్లు కావాలే. 24 గంటల కరెంట్ రావాలే. మీ అందరికీ తెలుసు… యావత్తు భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రధాన మంత్రి రాష్ట్రంలో కూడా సాధ్యం కావడం లేదు. మీ అందరికీ కూడా తెలుసు. కర్ణాటకలో కూడా నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ విధంగా వాగ్దానం చేసిందో… ఏ విధంగా కరెంటు కుప్పకూలిందో… 5 గంటలు కూడా కరంట్ ఇవ్వకపోతే… రైతులు రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నరు. కాని ఒక తెలంగాణలోనే మనం కరెంటు ఇవ్వగలుగుతున్నా. అందుకే కాంగ్రెసోళ్లు వస్తే ఇక్కడా కరెంటు గోస తప్పదని సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. రైతులు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. కమ్యూనిస్టు జెండాలు ఎగిరిన ప్రాంతం. కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం. మీ చైతన్యం అనేది చూపెట్టాలి. ఎన్నికలనగానే పైసల్ పట్టుకొచ్చే బేహారీలు.. పూటకోక పార్టీ మార్చే బేహార్లు… ఏమైనా చేస్తారు.. మన్నలి ముంచుతారు. వాళ్లకు నియమం లేదు.. సిద్ధ్దాంతం లేదు… నిబద్ధత అంటూ ఉండదు.. నిన్నొక పార్టీ..ఇయ్యాలో పార్టీ..రేపు ఒక పార్టీ…కేవలం డబ్బు మదంతోని, డబ్బు ఆహంకారంతోని, మేము ఏమైన చేయకల్గుతం, ప్రజలను కొనగలుగుతాం అనుకుంటరు. దయ చేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే. నల్లగొండ చైతన్యాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాల చైతన్యాన్ని మీరు కచ్చితంగా చూపెట్టాలి. ఇలాంటి వాళ్లకు బుద్ధ్ది చెబితేనే రాజకీయాల్లో ప్రక్షాళన జరుగుతది. ప్రజలకు లాభం జరుగుతది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ నుంచి బీజేపీ, ఇప్పుడు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్లు, గీతా కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మాజీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జెల్లా మార్కండేయులు, ఎంపీపీలు కర్నాటి స్వామి యాదవ్, పల్లె కల్యాణి, మెండు మోహన్ రెడ్డి, శ్వేతా రవీందర్ రెడ్డి, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, వీరమళ్ల భానుమతీ గౌడ్, పాశం సురేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మునగాల నారాయణరావు, భవనం శ్రీనివాస్ రెడ్డి, దాడి శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి శ్రీనివాస్ రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకుడు సందీప్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏడాది, ఏడాదిన్నర కాలంలో డిండి ఎత్తిపోతల ద్వారా మునుగోడులో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే బాధ్యత తనది సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల గురించి ప్రస్తావిస్తూ… ‘మీ అందరికీ తెలుసు పాలమూరు ఎత్తి పోతల పథకం పూర్తయితేనే. మన డిండికి, శివన్నగూడేనికి నీళ్లు వస్తయి. కాబట్టి నిన్న, మొన్ననే పాలమూరుకు క్లియరెన్స్ వస్తున్నయ్. కోర్టు కేసులు అన్ని పోతున్నయ్. కాబట్టి మన పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యే దశకు వచ్చింది. మొన్న ఒక పంపు నేనే స్టార్ట్ చేసిన. డిండి కాలువ ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్ వరకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది… ఇది కరువు ప్రాంతం కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసు కుంటున్న. వందకు వంద శాతం పనులు చేయించి, ఏడాది, ఏడాదిన్నర లోపే సుమారు రెండు లక్షల ఎకరాలకు మునుగోడు నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే బాధ్యత నాదే అని’ ప్రజలకు స్పష్టం చేశారు.
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నిబద్ధత కలిగిన వ్యక్తి అని, కచ్చితంగా గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘మిత్రుడు ప్రభాకర్ రెడ్డి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి… ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆడంబరాలకు పోయే వాడు కాదు. 24 ఏండ్ల క్రితం ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రభాకర్రెడ్డి నా వెంట ఉన్నడు. ఉద్యమంలో జైలుకు కూడా పోయినడు. ఆప్పటి నుంచి మడమ తిప్పకుండ పోరాటం చేస్తున్నడు. మీరందరూ చూస్తున్నరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు మనతో ఉన్నరు. ఎవరు మనతో లేరు… మీరు కండ్లరా చూసినారు. ఇలాంటి వాటన్నింటినీ మీరు భేరీజు వేయ్యాలి..చెప్పిన మాట మీద, ఇచ్చిన మాట మీద, నిలబడి ఉండే వాళ్లు ఎవరు… మాట తప్పి పోయేవాళ్లు ఎవరో…మీరు ఆలోచించాలి. మొన్న ఉప ఎన్నికల్లో ఏ చైతన్యం చూపెట్టారో… ఏ ధన ప్రభావానికి అడ్డంగా మీరంతా నిలబడి గెలిపించినారో… అలాగే ఈ ఎన్నికల్లో కూడా మునుగోడు ప్రజలు కచ్చితంగా ప్రభాకర్రెడ్డినే గెలిపించాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు అవకాశం లభిస్తే మరోసారి ప్రత్యేకంగా మునుగోడు చివరి దశలో వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంటతో సభలో హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి.
చండూరు : ‘తన ప్రాణాలను సైతం లెకచేయకుండా సీమాంధ్ర పాలకులపై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు భరతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు. అత్యధిక ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు గోడు తీర్చేందుకు మిషన్ భగీరథను ప్రారంభించి ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారు. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నారు. డబ్బుతో రాజకీయం చేసే వాళ్లను నమ్మకూడదు. మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మరోసారి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలి.’