దామరచర్ల, ఏప్రిల్ 11 : చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దామరచర్ల, వీరప్పగూడెం, వీర్లపాలెం, ఇర్కిగూడెం, కల్లేపల్లి, రాజగట్టు, కొండ్రపోల్, కేశవాపురం, తెట్టకుంట, తిమ్మాపురంతోపాటు పలు గ్రామాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. దాంతో ఆయా గ్రామాల ప్రజలకు నీటి ట్యాంకర్లే దిక్కయ్యాయి.
గ్రామాల్లో 80 శాతం బోర్లు నీళ్లు లేక ఒట్టిపోయాయి. చెరువులన్నీ అడుగంటి పోవడంతో కనీసం పశువుల దాహార్తికి కూడా నీరు దొరుకని పరిస్థితి నెలకొంది. దాంతో చాలా మంది రైతులు పశువులను సాదలేక అమ్మకాలు జరుపుతున్నారు. గిరిజన తండాల్లో నీటి సమస్య మరీ తీవ్రంగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కరువు పరిస్థితులు నేడు మళ్లీ కనిపిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా.. మరికొన్ని గ్రామాల్లో రానున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సొంత డబ్బులతో ట్యాంకర్లు తెప్పించి ప్రజలకు నీటిని అందిస్తున్నారు.
నాగార్జునాసాగర్ నుంచి రెండు పర్యాయాలు ఎడమ కాల్వకు నీరు వదిలినప్పటికీ మండలంలోని చెరువులు నింపక పోవడం వల్లే గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సాగర్ పక్కనే ఉన్న ప్రాంతాలను వదిలి దిగువన 100 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నా స్థానిక నాయకులు పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము గ్రామాలు వదిలి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో నీటి ఎద్దడితో నెల రోజులుగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద గురుకులాలకు నేరుగా గ్రిడ్ నుంచే తాగునీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం నీటి సరఫరా సరిగా లేక, ఉన్న నీటిని నిల్వ చేసుకునేందుకు సంపులు లేక పోవడంతో అవసరాల కోసం నీరు లేక బాలికలు అవస్థలు పడుతున్నారు. దాంతో వారికి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.