హాలియా, మార్చి 30 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు. సాగునీరు రాక, 24గంటల కరెంట్ ఉండక, కాస్తోకూస్తో ఉన్న భూగర్భ జలమట్టం కూడా అడుగంటిపోవడంతో బోరుబావులు, వాగుల ఆధారంగా వేసిన వరిచేలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే సమయంలో పచ్చటి పంట చేలు కండ్ల ఎదుటే ఎండిపోతుండటంతో రైతులు దుఃఖిస్తున్నారు. గత్యంతరం లేక ఎండిన పంట పొలాల్లో పశువులు, గొర్రెలు, మేకలను మేపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వ కింద యాసంగిలో క్రాఫ్ హాలిడే ప్రకటించడంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత ఏడాది యాసంగిలో 1,26,489 ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ఈ ఏడాది సగానికి పడిపోయింది. సాగర్ ఎడమ కాల్వకు సాగునీరు ఇవ్వకపోవడంతో ఆయకట్టు అంతా బీడుబారింది. బోరు బావులు కింద 76,323 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. ఎండ తీవ్రతకు భూగర్భ జలమట్టం అడుగంటిపోవడం, ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వకపోవడంతో సాగుచేసిన దాంట్లో 10వేల ఎకరాల పంటలు ఎండిపోగా, మరో 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇచ్చింది. సాగర్ ఎడమ కాల్వ ద్వారా రెండు కార్లుకు సరిపడా సాగునీరు ఇవ్వడంతో రైతులంతా ఆనందంగా వరి సాగు చేశారు. వ్యవసాయం అంటే పండుగ అనుకున్నారు. కానీ.. కొద్దిరోజుల క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో సాగర్ ఎడమ కాల్వ కింద క్రాఫ్ హలిడే ప్రకటించింది. దీనికి తోడు వ్యవసాయానికి కరెంటు 16గంటలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల కింద వేసిన వరి చేలు సైతం ఎండిపోతున్నాయి.
వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయాలని, ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి జాతీయ రహదారులపై ధర్నా, రాస్తారోకోలు చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడంతో వరి చేలు ఎండిపోయాయి. త్రిపురారం మండలంలోని రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాల్లో పోసి పంటలను కాపాడే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఎండిపోయిన పంట చేలల్లో పశువులు మేపుతున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు పండుగలా వ్యవసాయాన్ని చేస్తే.. నేడు రేవంత్రెడ్డి పాలనలో దండుగలా మారిందని రైతులు పేర్కొంటున్నారు.
తుంగతుర్తి, మార్చి 30 : తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, సింగారంతండా, మొండికుంటతండా, సూర్యతండా, మంచితండా, రావులపల్లి, బండరామారం, తుంగతుర్తి, వెంపటి తదితర గ్రామాల్లో 800 ఎకరాలకుపైగా వరి పంట ఎండిపోయింది. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సమయానికి నీరు రాకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఎండిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శుక్రవారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ జలాలు పూర్తిగా రావడంతో సస్యశ్యామలమైందని రైతులు తెలిపారు. ఈసారి ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారులో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కుంటలు, చెరువులు నింపేవారు. దాంతో బోర్లలో, బావుల్లో నీళ్లు ఉండేవి. కాల్వల ద్వారా నీళ్లు వచ్చేవి. పంటలు బాగా పండాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని వదలడంతో పది రోజులకు పైగా అధికారులు నిర్లక్ష్యం చేశారు. నేడు 11 ఎకరాల్లో వరి పెట్టిన. పంట పూర్తిగా ఎండిపోయింది. నాలుగు లక్షలకు పైగా పెట్టుబడి నష్టపోయా.
– దయ్యాల లింగయ్య, రైతు, వెలుగుపల్లి, తుంగతుర్తి మండలం
నా సొంతూరు తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడెం. నేను అనుముల గ్రామంలో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. భూగర్భ జలమట్టం అడుగంటిపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీలేక పశువుల మేతకు ఇచ్చాను. ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. యాసంగిలో వరిసాగు చేయడం వల్ల లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లింది. పంట ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– శ్రీనివాస్, రైతు, తిరుమలగిరి సాగర్ మండలం, నల్లగొండ జిల్లా
మాది అనుముల మండలం వీర్లగడ్డతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లారెడ్డిగూడెం, నేను ఈ యాసంగిలో మూడెకరాల్లో వరి సాగు చేశాను, నాటు పెట్టిన నెల రోజులకే నీళ్లు లేక ఎండిపోయింది. చేసేదేమీ లేక ఎకరం పొలాన్ని పశువులకు మేతగా ఉపయోగించాను. ఉన్న రెండెకరాల పొలాన్ని కాపాడుకునేందుకు రూ.2 లక్షలతో రెండు బోర్లు వేయించాను. కొన్ని నీళ్లే పోస్తున్నాయి. చేతికొచ్చే దశలో పొలం ఎండిపోతుంది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లేటట్టులేదు.
– గుడిపాటి నాగరాజు, రైతు, పుల్లారెడ్డిగూడెం, అనుముల మండలం