తిరుమలగిరి, ఏప్రిల్ 3: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడేసింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నిరుపేదలకు ఈ ఇండ్లు దక్కేవని పేర్కొంటున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఒకటి. ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి వారి కల సాకారం చేయాలని 2015లో ఈ పథకం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.50 లక్షలు వెచ్చించి నిర్మించారు. అనేక చోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసి పేదల కండ్లల్లో సంతోషం నింపింది. కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా ప్రభుత్వం మారడంతో పంపిణీ కాలేదు. మరికొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. దీంతో పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి.
నియోజకవర్గానికి 451 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. కొన్ని మండలాల్లో పూర్తి కాగా మరికొన్ని మండలాల్లో అంసపూర్తిగా మిగిలాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. తిరుమలగిరి మండలంలో 65 ఇండ్ల నిర్మాణాలకు 2016లో శంకుస్థాపన చేశారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టి స్లాబ్లు వేసి గోడలు కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు అనధికారికంగా వాటిని వాడుకుంటున్నారు. మరికొన్ని నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్దిరాల మండలానికి మంజూరైన 72 ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా ఎవ్వరికీ పంపిణీ చేయలేదు. దీంతో వాటిలో కంపచెట్లు పెరిగి నిర్మాణాలు శిథిలావస్థకు చేరుతున్నాయి.
ఇండ్లపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు కొన్ని పగిలిపోయి.. మరికొన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. తుంగతుర్తి మండలంలో 18 ఇండ్లను పూర్తి చేశారు. వాటిని పేదలకు పంపిణీ చేయకపోవడంతో వాటిలో కంపచెట్లు పెరిగాయి. నిరుపయోగంలో మారిన ఇండ్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. నూతనకల్ మండలం పెద్దనెమల గ్రామానికి 37 ఇండ్లు మంజూరు చేశారు. పునాదులలోనే ఇండ్ల నిర్మాణం పనులు నిలిచి పోయాయి. శిల్పకుంట్ల గ్రామానికి మంజూరు చేసిన 30 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
జాజిరెడ్డిగూడం మండలం అడివెంల గ్రామాని కి మంజూరు చేసిన 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేయడంతో ప్రజలు నివాసం ఉంటున్నారు. నాగారం మండలం కొత్తపల్లి గ్రామానికి మంజూరైన 75 ఇండ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో విసుగెత్తిన నిరుపేదలు అనధికారికంగా ఆ ఇండ్లను ఉపయోగించుకుంటున్నారు. వర్దమాన్కోట గ్రామానికి మంజూరైన 35 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినా పంపిణీకి నోచుకోవడం లేదు. శాలిగౌరారం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి 30 ఇండ్లు మంజూరు కాగా ఇందులో సగం ఇండ్లను నిర్మించారు. మరోసగం ఇండ్లు అసంపూర్తిగా మిగిలాయి.
ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మరమ్మతులు చేసి పేదలకు పంచాలి. గూడులేని పేదలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. పేదలకు అందాల్సిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలి.
-కడెం లింగయ్య, తిరుమలగిరి