నడిగూడెం, మార్చి 26 : దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని తెలంగాణ స్టేట్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం వల్లాపురంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల సభ్యత్వం గల ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటించారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ పంట నష్ట పరిహారాన్ని ఇంత మొత్తంలో ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తొమ్మిందేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూఅభివృద్ధి చేశారన్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ జెండాలతో గ్రామమంతా గులాబీమయంగా మారింది. జై తెలంగాణ, జై జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తితింది. ఆత్మీయ సమ్మేళనం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్లు పుట్టా రమేశ్, గోసుల రాజేశ్, పాలడుగు ప్రసాద్, దేవబత్తిని సురేశ్ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, బడేటి చంద్రయ్య, దేవబత్తిని వెంకటనర్సయ్య, ఖలీల్అహ్మద్, నూకపంగు ఈదయ్య, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
వ్యవసాయా నికి 24గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటు పడుతున్నట్లు తెలిపారు. నాడు అధ్వానంగా ఉన్న పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలతో పాటు క్రీడా మైదానాలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచ్లు, గ్రామస్తుల కృషితో గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో పల్లెలు కళకళలాడుతున్నాయని తెలిపారు. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను గడపగడపకూ చేరవేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.