భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అధిక వర్షాలు కురుస్తున్న సమయంలో అశ్రద్ధ చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంటుందని, వాతావరణ శాఖ హెచ్చరికలను బేఖాతరు చేయొద్దని సూచించారు. శిథిలావస్థకు చేరినభవనాలు ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, వాగులు, కాల్వల వద్ద వరద ఉధృతి ఉన్నందున ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు పనులు వాయిదా వేసుకోవాలని, పిల్లలు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి ఇబ్బంది రావద్దని, విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని, సీజన్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలని సంబంధిత సమీక్షలో అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి ఉన్నారు.
– నల్లగొండ, జూలై 27
నల్లగొండ, జులై 27: అల్పపీడనం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థ్దాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. తొలుత జిల్లాలో వర్షపాతం వివరాలు పరిశీలించిన ఆయన అదధికారులు ఏఏ చర్యలు తీసుకోవాలి అనే కోణంలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా శిథిలావస్థ్దలో ఉన్న భవనాలు కూలీ పోయే అవకాశం ఉన్నందున వాటి వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల పట్ల అశ్రద్ధ వహిస్తే నష్టం జరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చేసే హెచ్చరికలు ఎవరు కూడా బేఖాతరు చేయవద్దు అన్నారు. ఇప్పటికే జిల్లాలో వంద చెరువులకు పైగా చెరువులు నిండుకుండల్లా మారాయని ఆయా చెరువుల ద్వారా ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అనవసరమైన పనులు వర్షాలు తగ్గే వరకు వాయిదా వేసుకోవాలని, పిల్లలను బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, వాగులు తెగితే నష్టం జరిగే అవకాశం ఉన్నందున గ్రామీణ స్థాయి అధికారులు సమన్వయంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వరదల వల్ల ఇండ్లల్లోకి నీరు చేరే అవకాశం ఉన్నందున పంచాయతీరాజ్ శాఖ ఆయా పాలక వర్గాల సహకారంతో పరిష్కార మార్గాలను చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరితే అక్కడి ప్రజలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్అండ్బీ రోడ్లు సైతం తెగే అవకాశం ఉన్నందున అవి తెగితే ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్ అధికారుల సాయంతో ఇతర మార్గాల ద్వారా మళ్లీంచాలని అన్నారు. గతంలో వరదలు వచ్చిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిస్థ్దితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. ఈ వర్షాల వల్ల విద్యుత్కు అంతరాయం కలుగనున్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం రైతులను కలుస్తూ అధిక వర్షాలు కురిస్తే వాటి వల్ల వర్షాధార పంటలకు జరిగే నష్టాలను తెలుపుతూ రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడు లక్షల దాక పత్తి సాగు అయినందున రైతులకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ అదనపు వర్షాల వల్ల తాగు నీటి పైపులు పలిగే అవకాశం ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇక ఈ సీజన్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం సిద్ధ్దంగా ఉండాలని వైద్య శాఖ వారు మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య సమస్య లేకుండా అన్ని ప్రాంతలను శుభ్రం చేయాలన్నారు. ఈదరు గాలులకు కూలిన చెట్లు ఎప్పడికప్పుడే తొలగించాలని, క్షేత్ర స్థ్దాయిలో ఎలాంటి ఆటంకాలు జరిగినా పోలీస్ సాయం తీసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ గ్రామ, మండలస్థ్దాయిలో ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా వెంటనే స్పందించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినప్పటికీ ఆ సమస్య తన దృష్టికి తీసకోని రావాలని కలెక్టర్ తెలియచేశారు. ఈ సమావేశంలో నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్రీనివాస్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.