యాదాద్రి భువనగిరి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : చీర, జాకెట్, పంజాబీడ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్.. ఇవీ ఏటా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా. పవిత్రమైన పండుగ సందర్భంగా నాటి బీఆర్ఎస్ సర్కాకు కానుకల కిట్ అందించేది. కానీ ఈ సారి రంజాన్ తోఫా అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు తోఫా ఉంటుందా..? లేదా..? అనేది స్పష్టత లేదు. గతంలో ఇఫ్తార్ విందుల కోసం మసీదులకు సైతం నిధులు విడుదల చేసేది. ఈ సారి మాత్రం ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం, ఆదేశాలు లేవని మైనార్టీ సంక్షేమ అధికారులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు పెద్దపీట వేశారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులందరికీ రంజాన్ తోఫా అందించారు. ఆయా మండలాల మసీదుల కమిటీల ఆధ్వర్యంలో నిరుపేదలను ఎంపిక చేసేవారు. గిఫ్ట్లు ముందుగానే జిల్లాలకు వచ్చేవి.
వాటిని నియోజకవర్గాలు, మండల కేంద్రాలకు తరలించేవారు. రంజాన్ ముందు దినాల్లోనే కానుకలు పంపిణీ చేసేవారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఈ సారి ముస్లింల పవిత్ర ఉపవాసం ప్రారంభమై 13రోజులైంది. వచ్చే నెల 12 లేదా13 తేదీల్లో పండుగను నిర్వహించననున్నారు. నెలవంక ఆధారంగా రంజాన్ తేదీని నిర్ణయిస్తారు. ఈ సారి కానుకల పంపిణీపై ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు.
రంజాన్ సందర్భంగా గతేడాది ముస్లింలకు తోఫాను విజయవంతంగా పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,500మందికి కానుకులను అందించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,500, నల్లగొండలో 10,500, సూర్యాపేటలో 6,500 తోఫాలు ఉన్నాయి. తోఫాలో కుటుంబంలోని భార్యభర్తలతోపాటు వారి పిల్లలకు కూడా కొత్త దుస్తులను అందించారు. అంతే కాకుండా సేమియా, పంచదార కూడా పంపిణీ చేశారు.
రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయతీగా వస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా నిధులను సంబంధిత కమిటీల బ్యాంక్ ఖాతాల్లో అధికారులు నిధులను జమ చేసేవారు. గతేడాది ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు గతేడాది రూ. 39లక్షలను ఖర్చు చేసింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ. ఐదు లక్షలను విడుదల చేసింది. ఈ నిధులతో ఎంపిక చేసిన మసీదుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసేది.
మరోవైపు ఎన్నికల కోడ్ ఉందని, అందుకే ఇంకా నిర్ణయం తీసుకోలేదని పలువురు చెబుతుండగా, ఇది కొత్త కార్యక్రమం కాదని, ఏటా కొనసాగుతున్నదని మరికొందని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమం కావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాగైనా అమలు చేస్తుందని ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి.