పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఇక పోషకాల గని కానున్నది. సహజంగానే రైస్ మిల్లుల్లో పాలిషింగ్ కారణంగా పోషకాలు లోపిస్తుండడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఫోర్టిఫైడ్ కర్నెల్ను మిక్స్ చేసి పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రతి క్వింటా బియ్యంలో ఒక కిలో కర్నెల్స్ చొప్పున మిల్లులోనే కలిపి.. ఈ నెల నుంచి పూర్తిస్థాయిలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, మిటమిన్-బి వంటి పోషకాలు ఉండే కర్నెల్స్.. రక్తహీనత తగ్గింపు, రోగనిరోధకశక్తి దోహదపడనున్నాయి. నెలలో కొన్నిచోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, నేటి నుంచి అన్ని చౌక ధరల దుకాణాల్లో కర్నెల్స్ కలిపిన బియ్యాన్నే పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, మోడల్ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేసే సన్నబియ్యంలోనూ ఈ కర్నెల్స్ కలుపనున్నారు. కర్నెల్స్ నీటిలో తేలుతుండడం వల్ల కొద్దిమంది ప్రజలు అపోహతో వీటిని ఏరిపారేసి అన్నం వండుకుంటున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో సదస్సులకు పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.
-నల్లగొండ, జూలై 31
నల్లగొండ, జూలై 31 : మిల్లుల్లో పాలిషింగ్ పేరుతో చేపట్టే మిల్లింగ్ వల్ల బియ్యంలో పోషకాలు లోపిస్తుండడంతో క్వింటా బియ్యం రూ.4 నుంచి 5 వేలు కొని తిన్నప్పటికీ అవి పోషకాలు లేని బియ్యంగానే ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితి పేదలకు రావద్దనే ఆలోచనతో ప్రభుత్వం అందజేసే రేషన్లో పోషకాలు మిక్సింగ్ చేసే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. పోషకాలు ఉన్న ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను ఈ రేషన్ బియ్యంలో కలిపి ఈ జూలై నుంచి పంపిణీ ప్రారంభించగా మంగళవారం నుంచి పూర్తి స్థ్దాయిలో కర్నెల్స్ కలిపిన బియ్యంనే పంపిణీ చేయనుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,006,560 కార్డుల ద్వారా 32,15,799 మందికి 19,293 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్, విటమిన్-12 పోషకాలు ఉంటాయి. వీటిని మిల్లుల వద్దనే మిల్లింగ్ చేసే సమయంలోనే కలిపి ఎఫ్సీఐకి పెడుతుండగా అక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు ప్రతి నెలా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
పేద ప్రజలతో పాటు సంక్షేమ వసతి గృహల్లో పోషకాలు కలిగిన కర్నెల్స్ను కలిపి సరఫరా చేయాలని యోచించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల పంపిణీలో భాగంగా నుంచి పూర్తి స్థ్దాయిలో చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేసిన సర్కార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల నుంచి పంపిణీ చేపట్టనుంది. పంజాబ్, గుజరాత్ నుంచి కర్నెల్స్ను కొనుగోలు చేసి క్వింటా రేషన్ బియ్యంలో కిలో కర్నెల్స్ను కలిపి మిక్సింగ్ చేస్తున్నారు. మిల్లుల వద్ద ధాన్యాన్ని మొదటిగా మిల్లింగ్ చేసి ఆ తరువాత నాణ్యమైన బియ్యాన్ని వేరు చేసి ఫోర్టిఫైడ్ కర్నెల్స్ను బ్లెండింగ్ మిషన్స్ ద్వారా కలిపి డెలివరీ చేయనున్నారు. మిల్లింగ్ చేస్తున్న సమయంలోనే కర్నెల్స్ను మిక్సింగ్ చేయడం వల్ల సమానంగా మిక్సింగ్ అవుతూ అందరికీ పోషకాలు సమాన
స్థాయిలో అందనున్నాయి.
ఎన్నో పోషకాలు కలిగిన కర్నెల్స్ను క్వింటా బియ్యంలో కిలోను కలిపి మిల్లుల వద్దే మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ సబ్సిడీ రూపంలో అందజేసే వారికి పంపిణీ చేస్తుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వినియోగదారులతో పాటు అంగన్ వాడీ, ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాలు, కస్తూర్బా, మోడల్ స్కూల్స్, ఇతర సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేస్తుంది. అయితే జూలైలో అన్ని వసతి గృహాలకు పంపిణీ చేసిన సన్న బియ్యంలో ఈ కర్నెల్స్ కలిపినవే ఇవ్వగా ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా ప్రభుత్వ సూచన మేరకు వండే వారిని అవగాహన కల్పించి వండించి పిల్లలకు పెట్టిస్తున్నారు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న ఈ బియ్యంలోనూ కర్నెల్స్ను కలపడంతో అవి ప్లాస్టిక్ బియ్యం అనుకోని ఏరిపారేయడం గమనార్హం. ఈ కర్నెల్స్ చూడడానికి ప్లాస్టిక్ లాగానే ఉండడం..నీటిలో వేస్తే తేలి ఉండడం మూలంగా ప్రజలు అపోహ పడి వాటిని ఏరివేసి మిగిలిన బియ్యం వండుకోని తింటున్నారు. అయితే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వీటి ఉపయోగం తెలియజేయాలని ప్రభుత్వ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ ఫోర్టిఫైడ్ రైస్ గురించి తెలియచేసేందుకు చర్యలు చేపడుతుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినెలా ఒక్కొక్కరి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో 4,66,057 రేషన్ కార్డుల ద్వారా 16,20,375 యూనిట్ల కింద 9,722 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 991 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో 3,23,561 కార్డులు ఉండగా 9, 34,453 యూనిట్ల ద్వారా 5,606 మెట్రిక్ టన్నుల బియ్యం 610 దుకా ణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,16,942 రేషన్ కార్డులు ఉండగా 6,60,971 మందికి 3,965 మెట్రిక్ టన్నులు దీంతో పాటు నల్లగొండలో ఆయా సంక్షేమ వసతి గృహలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థ్దలకు ప్రతి నెల 800 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్న సివిల్ సప్లయ్ శాఖ సూర్యాపేట జిల్లాలో 550 టన్నులు సరఫరా చేస్తుంది.
ఫోర్టిఫైడ్ కర్నెల్స్ రైస్లో పలురకాల పోషకాలు ఉంటాయి. మనిషి ఎదుగుదలతో పాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మనిషిలో జ్ఞాపకశక్తిని పెంపొందించడం, రక్తహీనత మెరుగు పరచడం, వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి దోహద పడుతాయి. ఇందులో ఐరన్తోపాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్, మిటమిన్-బీ పోషకాలు ఉంటాయి, కిలో ఫోర్టిఫైడ్ బియ్యంలో 3,525 మైక్రో గ్రాముల ఐరన్, పది వేల మైక్రోగ్రాముల పోలిక్ యాసిడ్, వంద మైక్రో గ్రాముల బీ-12 పోషకాలు కలిసి ఉంటాయి. కలిపిన బియ్యం ఆహారం రూపంలో తీసుకున్న వ్యక్తుల్లో చిన్నపిల్లలతో పాటు వృద్ధులకు కండరాలు గట్టిపడతాయి. ఎముకలు పటిష్టంగా ఉండడంతో పాటు కాల్షియం సమస్య కూడా నివారిస్తున్నది. గడిచిన రెండు సీజన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 250 మిల్లులకు ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ బ్లెండింగ్ మిషన్లు అమర్చడం వల్ల అక్కడే ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి పెట్టగా అవే తిరిగి మనకు రేషన్ బియ్యం రూపంలో అందుతున్నాయి.
జిల్లాలో కర్నెల్స్ కలిపిన రేషన్ బియ్యం జూలైలో సగం మేరకు పంపిణీ చేశాం. ఇక ఈ నెల నుంచి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే బియ్యంలో కర్నెల్స్ కలిపే ఇస్తాం. ధాన్యం మిల్లింగ్ చేసేటప్పుడే కర్నెల్స్ కలపడం వల్ల రేషన్ బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికీ పోషక విలువలతో కూడిన భోజనం తినే అవకాశం లభిస్తుంది. కొందరు అవగాహన లేక ప్లాస్టిక్ బియ్యం కలిశాయని పారేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అవి ప్లాస్టిక్ బియ్యం కాదు. పోషకాలు ఉన్న కర్నెల్స్. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో రేషన్ డీలర్లు, ప్రభుత్వ సంస్థ్దల్లో బియ్యం పంపిణీ జరిగే ఇనిస్టిట్యూట్స్ నిర్వాహకులతో సమావేశాలు పెట్టి వివరిస్తాం.
-వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ