చౌటుప్పల్, మార్చి 4 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం కిడ్నీ బాధితులకు వరంగా మారింది. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది. ఈ ఏడాది జనవరి 3న ఈ కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చి రెండు నెలలు పూర్తయ్యింది. అతి తక్కువ సమయంలోనే 580 సెషన్లు పూర్తి చేసుకొని ఇక్కడి బాధితులకు అండగా నిలుస్తున్నది. నిత్యం 20 మందికి ప్రాణం పోస్తున్నది. ఈ కేంద్రం ఏర్పాటుతో వ్యయప్రయాసలు తగ్గాయని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, భూదాన్పోచంపల్లి, గట్టుప్పల్, చిట్యాల, వలిగొండ మండలాల్లోని పలు గ్రామాల బాధితులు ఈ కేంద్రం ద్వారా సేవలు అందుకుంటున్నారు. 100 కిలోమీటర్లకు పైగా వెళ్లే రోగులంతా అత్యంత సమీపంలో ఈ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉండటంతో ద్విచక్రవాహనాలపై రోగులు వచ్చి డయాలసిస్ చేయించుకొని వెళ్తున్నారు. కుటుంబ సభ్యుల సహాయం లేకుండా చికిత్స కోసం వస్తున్నారు. అందుబాటులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో తమకు ఇబ్బందులు తప్పాయని బాధితులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సకాలంలో ఇంటికి వెళ్లి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే హైదరాబాద్కు వెళ్తే రోజంతా పట్టేదని చెబుతున్నారు.
నాణ్యమైన సేవలు అందుబాటులో..
ఈ డయాలసిస్ సెంటర్లో ఒకేసారి ఐదుగురికి చొప్పున రోజుకు 20 మందికి డయాలసిస్ చేస్తున్నారు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు షిప్టుల్లో ఆరుగురు టెక్నీషియన్లు సేవలు అందిస్తున్నారు. ఒకరికి డయాలసిస్ చేయాలంటే 4 గంటల సమయం పడుతుంది. దీనికితోడు ఎవరైనా రోగులు అప్పటికప్పుడు అత్యవసరమై ఫోన్ చేస్తే వెసులుబాటు చేసుకొని సేవలు అందిస్తున్నారు. డైలైజర్, టూబింగ్స్ కూడా ఒకే రోగికి వాడుతున్నారు. అదే ప్రైవేటు దవాఖానల్లో అయితే 5 నుంచి 10 మందికి వాడుతారు. ఒకరికి నెలలో 10 సార్లు డయాలసిస్ అవసరమవుతుంది. దీనికితోడు వారికి 4 సార్లు బ్లడ్, మరో 2సార్లు ఐరన్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు. బాధితుడు మొదటగా చేయించుకున్న రోజే రెండోసారి కూడా సమయం ఇస్తున్నారు.
దూరం పోవాల్సిన బాధ తప్పింది
అందుబాటులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 100 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్కు వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఏడాది నుంచి హైదరాబాద్కు వారానికి రెండు సార్లు వెళ్లిన. ఖర్చు కూడా ఎక్కువే పెట్టాల్సి వచ్చేది. దానికితోడు ఒక్కొక్కసారి చాలా అలస్యమయ్యేది. అదే ఇక్కడైతే తొవ్వ ఖర్చులు తప్ప వేరే ఖర్చులు లేవు. డయాలసిస్ కూడా బాగా చేస్తున్నారు.
-ఎడ్ల సైదులు, నేలపట్ల, చౌటుప్పల్
వారానికి రెండుసార్లు వస్తున్నా..
చికిత్స కోసం వారానికి రెండుసార్లు వస్తున్నా. ఇంతకుముందు నల్లగొండలో చేయించుకునేది. ఆలస్యమైతే ఇంటికి రావాలంటే రాత్రి బస్సులు ఉండేవి కావు. ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరంలో సెంటర్ ఉండటంతో ఇబ్బంది లేదు. కనీసం సూదులు కొనాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు.
-గంజి నరేందర్, పుట్టపాక, సంస్థాన్నారాయణపురం
ఇబ్బందులు తీరినయ్
రాష్ట్ర ప్రభుత్వం చౌటుప్పల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో ఆర్థిక భారం తప్పింది. కిడ్నీ చెడిపోవడంతో గత 4 నెలల నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకున్నా. ప్రతిసారీ రూ.5వేలు ఖర్చు అయ్యేది. నెలకు రూ.50 వేలు పెట్టాల్సివచ్చేది. అదికూడా 70 కిలోమీటర్లు వెళ్లి చేయించుకునేది. బస్సులు ఎక్కాలన్నా, దిగాలన్నా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు చౌటుప్పల్లోనే కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయడంతో ఆ ఇబ్బంది తప్పింది. ఇంటికి కూడా సకాలంలో వెళ్తున్నాం.
-కొలన్ సత్తిరెడ్డి, ఆరెగూడెం, చౌటుప్పల్