తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరుగనున్న వేడుకలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు జాతీయ జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వేడుకలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాలను ఎగురవేసి, అమర వీరులకు నివాళులర్పించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 1(నమస్తే తెలంగాణ).
రాష్ట్ర ఆవతరణ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. ఉమ్మడి జిల్లా అంతటా జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యేకంగా అలకంరించారు. కలెక్టరేట్లు, పోలీసు జిల్లా కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మామిడి తోరణాలు, పూలదండలు, లైటింగ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ తొమ్మిదేండ్లల్లో సాధించిన ప్రగతిని నలుదిశలా చాటేలా విస్తృత కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.జిల్లా కలెక్టరేట్లల్లో ఆవిర్భావ వేడుకలకు శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేశారు. అమరవీరుల స్తూపాలను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేడుకల షెడ్యూల్ కొనసాగనుంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. సరిగ్గా ఉదయం 9గంటలకు కలెక్టరేట్లల్లో జాతీయ పతకాలను ఆవిష్కరించనున్నారు. నల్లగొండ కలెక్టరేట్లో జరిగే వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రి జగదీష్రెడ్డి, యాదాద్రి కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిలు ముఖ్య అతిథిలుగా జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నా రు. ఈ వేడుకల్లో ఆయా జిల్లాల్లో అక్కడి జడ్పీ చై ర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్, ఎస్పీ, వివిధ విభాగాల జిల్లా అధికారులు, ప్రముఖులు పాల్గొననున్నారు. తర్వాత జిల్లా ప్రజలను ఉద్దేశిస్తూ దశాబ్ధి ఉత్సవ సందేశాన్ని ముఖ్య అతిథులు ఇవ్వనున్నారు.
విభిన్నంగా వేడుకలు
నేటి నుంచి 21 రోజుల పాటు రోజుకో తీరుగా విభిన్నంగా దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం మొత్తం 21 రోజుల పాటు పండగలా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నేడు ఆవిర్భావ వేడుకలతో మొదలై ఈ నెల 22వ తేదీన అమరుల సంస్మరణతో ముగియనున్నాయి. నేడు ఆవిర్భావ దినోత్సవం, 3వ తేదీన రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్తు విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండగ, 9న సంక్షేమ సంబరం, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్యం దినం, 15న పల్లె ప్రగతి ఉత్సవం, 16న పట్టణ ప్రగతి ఉత్సవం, 17న గిరిజన దినోత్సవం, 18న మంచినీళ్ల పండగ, 19న హరితోత్సవం, 20న విద్యాదినోత్సవం, 21న అధ్యాత్మిక దినోత్సవం, 22న అమరవీరుల సంస్మరణ దినోత్సవం పేరిట దశాబ్ధి ఉత్సవాలు కొనసాగనున్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి దశాబ్దిఉత్సవాలు అంబరాన్నంటేలా జరపాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
నల్లగొండ: రాష్ట్రం ఆవిర్భవించి పదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో పదేండ్లలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందని విధంగా రాష్ట్రం అభివృద్ది చెందింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు . రాష్ట్ర ప్రజలకు ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు
– గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్
చిరకాలం నిలిచేలా దశాబ్ది ఉత్సవం :మంత్రి జగదీశ్రెడ్డి
దశాబ్ది ఉత్సవాలు చరిత్రలో చిరకాలం నిలిచేలా నిర్వహించాలి. 21 రోజుల పాటు జరుగనున్న వేడుకలకు ఘనంగా చేయాలి. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని నలు దిశలా చాటేలా ఉత్సవాలు జరపించాలి. సామాన్య ప్రజలతో పాటు అభివృద్ధ్ది, సంక్షేమ ఫలాల లబ్ధిదారులంతా ఇందులో భాగస్వాములు కావాలి. సంక్రాంతిని తలపించేలా జరిగే రైతు ఉత్సవాల్లో రైతులంతా పాల్గొనాలని సూచించారు. కాళేశ్వరం జలాల తొలి ఫలితం అందుకున్న సూర్యాపేట జిల్లాతో పాటు మిషన్ కాకతీయతో జలకళను సంతరించుకున్న చెర్వుల వద్ద జాతరను తలపించాలి. ఫ్లోరైడ్కు చెక్ పట్టిన జిల్లాగా మంచినీళ్ల పండగను ఘనంగా జరుపుకోవాలి. సమైక్య పాలనలో అప్పటి నేతల స్వార్ధంతో నలిగిపోయిన జిల్లా నేడు స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో నిలదొక్కుకున్న తీరు దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిబింబించాలి. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అద్భుత ప్రగతిని జిల్లా సాధించింది. .