నకిరేకల్, సెప్టెంబర్ 8 : సమైక్య పాలనలో అంటరానివారుగా అణగదొక్కబడిన దళితులను స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అందజేసే రూ.10 లక్షల సాయంతో వివిధ రకాల యూనిట్లు పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో నకిరేకల్ మండలానికి 23, రామన్నపేట 39, చిట్యాల 17, నార్కట్పల్లి 22 దళిత యూనిట్లు మంజూరు చేశారు. నకిరేకల్ మండలం వల్లభాపురంలో 17 యూనిట్లు, నడిగూడేనికి 5 యూనిట్లు మొత్తం 22 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున 2.20 కోట్ల రూపాయలు అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో వారి ఇష్టం మేరకు పలు రకాల వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. నాడు కూలీలుగా ఉన్న వారు నేడు యజమానులుగా రాణిస్తూ ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు.
గతంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు వెళ్తుండేవాళ్లం. నా భార్య, నేను కలిసి నెలకు రూ.15 వేలు సంపాదించేవాళ్లం. సీఎం కేసీఆర్ దళితబంధు డబ్బులు ఇవ్వడంతో వాటితో అశోక్ లీల్యాండ్ (మినీ డీసీఎం) కొనుగోలు చేశాను. మిల్లుల నుంచి రైస్, పల్లీలు హైదరాబాద్కు తరలిస్తున్నా. సీజన్ లేకుంటే హౌస్ షిఫ్టింగ్ వంటి పనులు చేసుకుంటా. నెలకు రూ.40 నుంచి 50 వేలు సంపాదిస్తున్నా. నా పిల్లలను బాగా చదివిస్తున్నా. వాహనం లోడ్ చేసేందుకు రోజుకు ఇద్దరు లేదా ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. స్వయం ఉపాధి చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరే రావాలని కోరుకుంటున్నా.
రైస్మిల్లులో హమాలీ పని చేస్తూ రోజుకు రూ.500 సంపాదించేవాణ్ని. పని లేకపోతే చేపలు పట్టి అమ్మేవాణ్ని. నెలకు రూ.15 వేల వరకు వచ్చేవి. కుటుంబ పోషణ భారంగా ఉండేది. నా భార్య కూలికి పోయేది. సీఎం కేసీఆర్ దేవుడిలా దళిత బంధు ఇచ్చిండు. ఆ డబ్బులతో మినీ డీసీఎం కొనుక్కున్నా. గతంలో పని చేసిన రైస్మిల్ నుంచి హైదరాబాద్ వరకు బియ్యం తీసుకెళ్తా. లోడింగ్ లేనప్పుడు బండిని ఫంక్షన్లకు తిప్పుతా. నెలకు అన్ని ఖర్చులు పోను రూ.35 వేల వరకు మిగులుతున్నాయి. వాటితో నా కుటుంబాన్ని ఇబ్బంది లేకుండా పోషించుకుంటున్నా. మాకు ఇంత చేసిన కేసీఆర్ సారును మళ్లీ గెలిపించుకుంటాం.
-వరకాల జానయ్య, లబ్ధిదారుడు, నకిరేకల్
శాలిగౌరారం, సెప్టెంబర్ 8 : బతుకు జీవనం సాగించేందుకు ఏ వృత్తి అయితేనేమి అన్నట్లు.. దళితుడు అయినా తాను ఎంచుకున్న వృత్తిని నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వం అందించిన దళిత బంధును సద్వినియోగం చేసుకుని సొంత షాపుకు ఓనరయ్యాడు. అతనే శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన బాకి వెంకన్న. కొన్నేండ్లుగా మండలంలోని గురజాల గ్రామంలో అద్దె జాగాలో డబ్బాకొట్టు పెట్టుకొని సెలూన్ షాపు నిర్వహించేవాడు. కాగా, దళితబంధు పథకంలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మండలంలోనే మొదటి విడుతగా తుడిమిడి గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామంలో మొత్తం 17మంది దళితులను దళిత బంధుకు ఎంపిక చేసి వారి అభీష్టం మేరకు ఎంచుకున్న యూనిట్లను అందజేశారు. వారిలో ఒకరైన వెంకన్న.. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో గురజాలలో సెలూన్ షాపును సొంతంగా పెట్టుకున్నాడు. పట్టణాల్లోని షాపులకు దీటుగా షాపులో అన్ని సౌకర్యాలు కల్పించి క్షౌర వృత్తి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. నాడు నెలకు రూ.వెయ్యి అద్దె చెల్లించి షాపు నడిపేవాణ్ని అని, నేడు సీఎం కేసీఆర్ పుణ్యమాని సొంత షాప్కు ఓనర్ని అయ్యానని సగర్వంగా చెబుతున్నాడు. తనకు అండగా నిలిచిన ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెబుతున్నాడు.