యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటనను గిరిజనులు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, భువనగిరి మండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. దేశ చరిత్రలోనే గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత కేసీఆర్, గిరిజన బాంధవుడు అని కొనియాడారు. రిజర్వేషన్ల పెంపుతో విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరుగుతుందని ప్రశంసించారు. రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీతో తమ అభ్యున్నతికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్ గిరిజన బాంధవుడని ఎస్టీ నేతలు కొనియాడారు.
తుర్కపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, గిరిజన ప్రజాప్రతినిధులు
యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, గిరిజన నాయకులు