దామరచర్ల, మార్చి 24 : ముంచుకొస్తున్న కరువు మనుషులకే కాకుండా మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వానలు లేక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతోపాటు మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువులకు మేత దొరుకని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోవడంతో అవే మేతగా మారుతున్నాయి.
దామరచర్ల మండలంలో అనేక మంది కాపర్లు జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కాపర్లకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేశారు. వాటి ఆధారంగా అనేక మంది జీవాల మందను పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కరువు కారణంగా జీవాల పెంపకం కష్టంగా మారింది. ఇప్పటి వరకు మంచి డిమాండ్ ఉన్న గొర్రెలకు మేతలేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఎక్కడ కూడా నీరు, మేత లేక పోవడంతో కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో జీవాలను దూర ప్రాంతం వెళ్లి మేపుతున్నారు. ఒక్కొక్క కాపరికి 50 నుంచి 200 గొర్రెలు ఉన్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ఊరికి పోయి మేపుకొని వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడకు పోయినా ఎడారిలా కనిపించడంతో ఏం చేయాలో తోయని పరిస్థితుల్లో కాపర్లు ఉన్నారు.
భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లకింద వేసిన వరిపంట ఎండిపోవడంతో రైతులు కాపర్లకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొన్నది. దాంతో ఎండిన పొలాలను కాపర్లు ఎకరానికి మూడువేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి జీవాలను మేపుకొంటున్నారు. ఇప్పటి వరకు ఎండిన పొలాలు కాపర్లను ఆదుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది కాపర్లను ఆందోళనకు గురి చేస్తున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏదో ఒక రేటుకు జీవాలను అమ్ముకుంటున్నారు.
కరువు కారణంగా జీవాల పెంపకం కష్టంగా మారింది. నేను 100 గొర్రెలను పెంచుతున్నా. జీవాలకు ఎక్కడకు వెళ్లినా మేత, నీరు దొరుకడం లేదు. ఇప్పటి వరకు రైతులు వదిలేసిన పొలాలను మేపుతూ గడిపాం. నెల రోజుల నుంచి 20 మంది రైతులు వదిలేసిన పొలాలను కొని జీవాలను మేపిన. ప్రస్తుతం అవికూడా లేకుండా పోయినయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చెరువుల్లో చుక్కనీరు లేదు. గట్లపై మేతలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే జీవాలను అమ్ముకోవాల్సి వస్తుంది.
– చింతలచెరువు శ్రీనుయాదవ్, దామరచర్ల, గొర్ల కాపరి
గత పదేండ్లుగా ఎన్నడూ రాని కరువు ఇప్పుడు వచ్చింది. నేను వ్యవసాయంతో పాటు 30 జీవాలు పెంచుకుంటున్నా. కరువు కారణంగా పంటలు ఎండిపోగా జీవాలపై ఆధారపడ్డ. కానీ ఎక్కడా మేత లేక, తాపేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఏడాది చెరువుల్లో నీరులేదు. బోర్లన్నీ వట్టిపోయాయి. ప్రభుత్వం స్పందించి సాగర్ జలాలతో చెరువులు నింపి ప్రజల కష్టాలు తీర్చాలి.
– పగిడి కొండలు, దామరచర్ల