బొమ్మల రామారం, జూలై 25 : మెడికల్ విద్యను అభ్యసిస్తూ ఒత్తిడిని తట్టుకోలేక ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం మాజీ సర్పంచ్ వడ్లకొండ ఆనంద్చారి కుటుంబం మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో నివాసముంటున్నది.
ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో ఎంఎస్ చేస్తుండగా.. కూతురు దీక్షిత (29) బెంగళూరులోని ఓ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తూ.. వైద్యవృత్తి చేస్తున్నది. మూడు నెలలుగా సెలవులు ఇవ్వకపోవడంతో ఒత్తిడిలోనై ఇంటికి వచ్చింది. శుక్రవారం నాగారంలోని అపార్ట్మెంట్ పైనుంచి దూకగా, తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆదివారం మైలారంలో దీక్షిత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.