సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎటూ చూసిన గణేశ్ పండుగ సందడే. వీధులన్నీ గణేష్ విగ్రహాలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో అన్ని మార్కెట్లలో ప్రజలు రద్దీ కన్పించింది. మరో పక్క గణేవిగ్రహాల ధరలు పెరగడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 25 వేలకుపైగా సిబ్బంది గణేష్ పండుగ బందోబస్తులో పాల్గొంటున్నారు.
ఇలా నగరంలో ఎటూ చూసిన వినాయక నవరాత్రుల శోభ సంతరించుకుంది. కాలనీలు, బస్తీలలో వినాయక మండపాల వద్ద యువత ఏర్పాట్లతో బిజీగా ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ప్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 50 వేల వరకు చిన్న, పెద్ద వినాయక మండపాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నగరం మొత్తం పోలీసుల నిఘాలోకి వెళ్లింది. ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని తమ ప్రాంతానికి తీసుకొచ్చే సమయంలో ఆగమన్ పేరుతో ఘనంగా గణనాథుడికి స్వాగతం పలుకుతున్నారు. నిమజ్జనం రోజు ఉండే సందడే.. గణేషుడు ఆగమనం రోజు చేస్తూ మునుపెన్నడు లేని విధంగా గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

గణేష్ పండుగ వచ్చిందంటే బందోబస్తు ఏర్పాట్లపై రెండు నెలల నుంచే పోలీసులు కసరత్తు చేస్తుంటారు. నగరంలో గణేష్ నవరాత్రులు, నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం పోలీసులకు కత్తిమీద సాములాంటిది. దీంతో ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు ముందే పోలీసులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భక్తి శ్రద్దలతో పండుగ జరుపుకోవాలంటూ సూచనలు చేశారు. దీనికి తోడు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు తప్పని సరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఆయా పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లలో ఏర్పాటు చేసిన లింక్ల ద్వారా ఆన్లైన్లో తగిన సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.
దీంతో ఎన్ని మండపాలు ఏర్పాటవుతున్నాయి, అందుకు బందోబస్తు, నిమజ్జనం రోజు రూట్ మ్యాప్ వంటి అంశాలపై తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ ఆగమన్ నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో పోలీసులకు బందోబస్తులో సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. మండపాలకు జియో ట్యాగింగ్ చేస్తూ బందోబస్తును పోలీసులు పరిశీలిస్తున్నారు.

వివిధ రంగాల్లో అభివృద్ధి కుంటుపడడంతో సామాన్యుల ఆదాయం పెరగడం లేదు. అయితే ధరలు మాత్రం ప్రతియేడు పెరుగుతూ వస్తున్నాయి. ఇండ్లలో పూజలు చేసేందుకు గణేష్ విగ్రహాన్ని కొనేందుకు మార్కెట్కు వెళ్లే వారు ఆ ధరలను చూసి షాక్ అవుతున్నారు. గత ఏడాదితో పోలీస్తే 10 నుంచి 20 శాతం పండుగ ఖర్చు పెరిగిందంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ విగ్రహాలే కాకుండా, పూజ సామాగ్రి, ఇతరాత్ర పండుగ ఖర్చులు భారీగా పెరగడంతో పండుగలు ఎలా చేసుకుంటామంటూ ప్రజలు బాధ పడుతున్నారు.
నగరంలో ఎటూ చూసిన మార్కెట్ల రద్దీతోపాటు వినాయక విగ్రహాలు మండపాలకు తరలిస్తుండడంతో ఆయా రోడ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కాలనీలు, ప్రధాన రహదారుల్లో పండుగ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతుండడం, దానికి తోడు విగ్రహాల తరలింపు, పలు చోట్ల గణేష్ ఆగమన్ కార్యక్రమాలతో ఆదివారం సాయంత్రం నుంచి నగరంలో గణేష్ నవరాత్రుల శోభ సంతరించుకుంది. ఒక రోజు ముందే హైదరాబాద్లో గణేష్ పండుగ వచ్చినట్లుగా ఎటూచూసిన సందడి కన్పించింది. మరో పక్క నవరాత్రుల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలతోను ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ట్రాఫిక్ రద్దీతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసులు సూచనలు చేస్తున్నారు.