నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు. మొక్కలు చిన్నగా ఉండి నాటే సమయంలో చనిపోయే ప్రమాదం ఉండటంతో విత్తనాలు మొలకెత్తే దశలోకి వచ్చిన తర్వాత మరింత రక్షణ కోసం పాలిథిన్ కవర్లలోకి మారుస్తున్నారు. మొక్కల సత్వర ఎదుగుదలకు కావాల్సిన నాణ్యమైన మట్టి, ఎరువుల మిశ్రమాన్ని కలిపి విత్తనాలు నాటిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : హరిత తెలంగాణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా లక్షల మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దూర దృష్టితో గ్రామాలు, పట్టణాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామపంచాయతీలు, పట్టణాల్లో ప్రత్యేక నిధులతో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఆయా పంచాయతీ, పట్టణాల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో మూడు గ్రామ పంచాయతీలు మినహా 418 జీపీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు.
సాయినగర్ పోచంపల్లి, లప్పనాయక్తండా, బీఎన్తిమ్మాపూర్ మినహా అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటుతున్నారు. ఒక్కో నర్సరీలో పాతవి, కొత్తవి కలిపి కనీసం 10వేల మొక్కలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇందులో కొత్తవి ఆరు వేలు తగ్గకుండా ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా జిల్లాలో 42,18,249 మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కొత్తవి 3,490,434 సీడ్ ఉండగా, గతేడాదివి, కన్వర్షన్ కలిపి మరో 7,59,815 మొక్కలు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా తుర్కపల్లి మండలంలో 3,79,849 మొక్కలు నాటారు. ఆ తర్వాత బీబీనగర్, బొమ్మలరామారం మండలాల్లో 3.40 లక్షల చొప్పున, వలిగొండలో 3,38,400, భువనగిరిలో 3.30 లక్షలు, నారాయణపురంలో 3.10 లక్షల చొప్పున మొక్కలు పెంచనున్నారు.
ఆయా నర్సరీల్లో అధికారులు రకరకాల మొక్కలు పెంచుతున్నారు. పండ్లు, పూలు, నీడనిచ్చే సుమారు 30 రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. జామ, అల్లనేరేడు, చక్రమల్లె, మందారం, నేరేడు, మల్లె, చామంతి, వాటర్ ఆపిల్, గన్నేరు, నూరు వరహాలు, మైదా, గులాబీ, గుల్మోహర్, పెల్టో ఫోరం, దానిమ్మ, కానుగ, పారిజాతం, టెకోమా, శ్రీగంధం, నెమలినార, వేప, కదంబ, నిద్రగన్నేరు, బాదాం, బోహమియా, స్పతోడియా, చింత, సీతాఫలం, నరేఫా, సిల్వియా తదితర మొక్కలను పెంచుతున్నారు. రకరకాల మొక్కలతో నర్సరీలు పచ్చదనం పరుచుకొని చిట్టడవిని తలపిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 418 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. మొత్తంగా 42,18,249 మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో కొత్తగా 3,490,434 సీడ్ వేశాం. మిగిలినవి గతేడాదివి ఉన్నాయి. వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాం. నర్సరీల్లో మొక్కలు చనిపోకుండా ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు చేపట్టాం.
– నాగిరెడ్డి, డీఆర్డీఓ