ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 51 మేజర్ల ద్వారా ఎడమకాల్వ కింద వరి సాగు చేస్తారు. సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా బోరు బావులు, ఊట బావుల ద్వారా వరిసాగు చేశారు. ఈ యాసంగిలో సుమారు లక్ష ఎకరాల్లో వరి వేశారు. నాట్లు వేసే సమయానికి ఇప్పటికి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు సరిగా పోయడం లేదు. వేసిన కొద్ది మొత్తం పొలం కూడా పారగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా ఖమ్మం జిల్లాలో తాగునీటి కొరత తీర్చేందుకు పాలేరు రిజర్వాయర్ను నింపాలని వారం రోజులుగా 4వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోనే డ్యామ్ ఉన్నా జిల్లా మీదుగానే నీటిని ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్ కింద రైతులు దర్జాగా గేట్లు తెరిచి పంట పొలాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులు మేజర్లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకునే వారే లేరు.
సోమవారం ఒక్క పూట మాత్రమే మేజర్లకు నీటిని వదిలి వెంటనే నిలిపి వేశారు. ప్రతి మేజర్ వద్ద పోలీసులు, ఎన్ఎస్పీ సిబ్బందిని కాపలాగా ఉంచి పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలిస్తున్నారు. తమ జిల్లా మీదుగా నీరు తీసుకెళ్లి ఖమ్మం జిల్లా రైతుల పొలాలకు నీటిని అందించడమేంటని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సాగునీరు అందించాలనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సాగర్ ఆయకట్టు కింద లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఇవి ఉండగా సుమారు 15వేల ఎకరాలకుపైగా వరి పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. కనీసం 15రోజులపాటు సాగునీరు అందించినట్లయితే పంటలు చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టి రైతులు వరి సాగు చేశారు. పంటలు ఎండిపోతే తమ బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టు కింద సుమారు 4వేల ఎకరాలు ఎండిపోవడంతో రైతులు ఆశలు వదులుకొని జీవాలు, పశువులను మేపుతున్నారు.
ముల్కల కాల్వ మేజర్ కింద నాకున్న రెండెకరాల్లో వరి సాగు చేసిన. బోరు నీళ్లే ఇప్పుడు దీనికి ఆధారం. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వారం రోజుల నుంచి ఎడమ కాల్వ ద్వారా నీటిని ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తున్నారు. మాకు కూడా నీళ్లు వదిలితే మా పొలాలు చేతికొస్తాయి. రూ.60వేల పెట్టుబడి పెట్టి పొలం సాగు చేసిన. ఈ పొలం ఎండిపోతే ఆర్థికంగా చితికిపోతాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మేజర్లకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.
– దుండిగాల వెంకటయ్య, రైతు, యాద్గార్పల్లి, మిర్యాలగూడ