తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది. సూర్యాపేట జిల్లాలో కాళేళ్వరం, నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు రావడం, మిషన్ కాకతీయ ఫలితంగా భూగర్భ జలాలు పెరుగడంతో రైతులు విస్తృతంగా వరి సాగు చేశారు.
ఆరేండ్ల మాదిరిగానే ఈ వానకాలంలోనూ 4,31,730 ఎకరాల్లో వరి సాగు చేయగా 10,58,290 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 2.49లక్షల మంది రైతుల చేతికి రూ.2,546 కోట్లు అందాయి. రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం మరో రూ.215 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సీజన్లో అన్నదాతలకు రూ.2,761 జిల్లా రైతులకు కోట్లు చేరాయి. చేతి నిండా డబ్బులతో రైతులు సంతోషంగా ఉన్నారు. యాసంగి పంటల సాగులో బిజీగా మారారు.
సూర్యాపేట, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : చెరువులు బాగుపడడం.. సరిపడా వర్షాలు కురువడం.. నాగార్జునసాగర్, మూసీ, కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు రావడంతో సూర్యాపేట జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. దాంతో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో పంట పండింది. ఫలితంగా వరుసగా ఆరేండ్ల మాదిరిగా ఈ వానకాలంలో కూడా రైతన్నల జేబులు డబ్బులతో గలగలలాడుతున్నాయి. జిల్లాలోని 2.49లక్షల మంది వరి సాగు చేసిన రైతుల చేతికి ఈ ఒక్క సీజన్లోనే 2,761 కోట్ల రూపాయలు అందాయి.
జిల్లా వ్యాప్తంగా 4,31,730 ఎకరాల్లో వరి సాగు చేయగా రూ.2,546 కోట్ల విలువ చేసే 10,58,290 మెట్రిక్ టన్నుల పంట పండింది. సీజన్కు ముందే పంట పెట్టుబడి సాయం కింద జిల్లా రైతుల అకౌంట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.215 కోట్లు జమ చేసింది. ఆరుగాలం కష్టించే రైతన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నష్టపోవడం పరిపాటిగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రైతన్న మోములు చిరునవ్వులు చిందించేలా అనేక పథకాలు అమలవుతూ వచ్చాయి.
సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టగా.. నిరంతర ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందించడం, విత్తనాలు అందుబాటులో ఉంచడంతోపాటు రైతులకు సూచనలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేసింది. ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒక ఏఈఓను నియమించింది. ప్రభుత్వం ఈ స్థాయిలో రైతులు, వ్యవసాయానికి చేయూత ఇవ్వగా అధికారులు, వ్యాపారుల్లో గతంతో పోల్చితే మార్పు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వమే ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది. దీంతో వ్యాపారులు సైతం తమ లాభాలను కొంత తగ్గించుకొని రైతుల నుంచి మద్దతు ధరకు మించి చెల్లించి దాన్యం కొనుగోలు చేస్తున్నారు. వానకాలంలో వర్షాలు పుష్కలంగా కురువడంతోపాటు నాగార్జునసాగర్, మూసీ నదుల్లో సరిపడా నీళ్లు ఉండగా.. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చాయి. దీంతో జిల్లాలో ఎక్కడా గుంట వదలకుండా వరి పొలం వేశారు.
ఒక్క సీజన్లోనే రైతులకు రూ.2,761 కోట్లు వానకాలం సీజన్లో జిల్లా రైతుల జేబుల్లోకి పంట పెట్టుబడి సాయం రూ.215 కోట్లు, పండించిన పంటకు రూ.2,546 కోట్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 4,31,730 ఎకరాల్లో వరి సాగు చేయగా.. దాదాపు 10,58,290 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.2,203 మద్దతు ధర చెల్లిస్తున్నది. బహిరంగ మార్కెట్లో సన్న రకాలకు రూ.2700 నుంచి 2900 రూపాయల వరకు వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇందులో సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో రూ.1,396 కోట్ల విలువ చేసే 6,34,974 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్లు, ప్రైవేట్ రైస్ మిల్లర్లు రూ.1150 కోట్ల విలువ చేసే 4,23,316 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కాగా, జిల్లాలో వానకాలం పంటల కొనుగోళ్లు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాల్వల్లో కంపచెట్లు మొలిచి పూడిపోయాయి. నీళ్లు వస్తాయో, రావోనని అనుకునేవాడిని. ఎన్నో బోర్లు వేసి ఇబ్బందుల పాలయ్యాను. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గతంలో తవ్విన కాల్వల గుండా గోదావరి జలాలను మళ్లించారు. అన్ని చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లల్లో నీళ్లు పైకి వచ్చాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించారు. నాకున్న ఆరు ఎకరాలకు రైతుబంధు డబ్బులు రూ.30వేలు బ్యాంకులో జమ అయ్యాయి. పంట బాగా పండడంతో వానకాలం వడ్లకు రెండు లక్షల రూపాయలు వచ్చాయి. రైతుల కోసం ఇంత మంచి చేసిన కేసీఆర్ను ఎప్పటికీ మరువం. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలి.
– దోమల బాలమల్లు, రైతు, నాగారంబంగ్లా, నాగారం మండలం
నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద వానకాలం సీజన్లో రూ.30వేలు బ్యాంకులో పడ్డాయి. గోదావరి జలాలు రాక ముందు కరెంట్ సరిగ్గా లేక ఎంతో ఇబ్బంది పడ్డా. నాకున్న ఆరు ఎకరాల్లో పొత్తుల బావి నీళ్లతో ఎకరం సాగు చేసేది. ఆ పంటకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు డబ్బులు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాత గోదావరి జలాలు రావడం, నిరంతర ఉచిత విద్యుత్ ఇవ్వడంతో మొత్తం భూమిని సాగు చేశాను. ఈ సీజన్లో 100 క్వింటాళ్ల వడ్లు పండించాను. పండిన పంటను మా ఊర్లో ఐకేపీ కేంద్రంలో అమ్మాను. 2లక్షల 10వేల రూపాయలు వచ్చాయి. వారం రోజుల్లోనే నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
– గోసుల విజయ్కుమార్, రైతు, బొల్లంపల్లి, అర్వపల్లి మండలం