సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నందికొండ హిల్కాలనీ కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సంందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చారని, చిన్న రోగాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స, ఆపరేషన్లు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులు తీర్చుతున్నామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయని, మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో ప్రజలు సర్కారు దవాఖానలకే వస్తున్నారని చెప్పారు.