హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి నోముల నర్సింహయ్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను కొనసాగించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు. ఏప్రిల్ 17న జరిగే నియోజకవర్గ ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి తనని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో బుధవారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సభకు హాజరైన సీఎం కేసీఆర్కు అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు అలాగే వేదిక ముందున్న అక్కాచెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పెద్దలకు పేరుపేరునా హృదయపూర్వక పాదాభివందనాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 2018లో మా నాన్న నోముల నర్సింహాయ్య ఇదే వేదికగా మీ అందరి ముందుకు వచ్చి ఆశీస్సులు కోరారు. భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నోసార్లు అసెంబ్లీ లోపల కావొచ్చు, బయట కావొచ్చు ఏ విధంగా పాటుపడ్డారో మీ అందరికీ తెలిసిందే. గత 35 ఏళ్లుగా జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో చేసి చూపిస్తానని చెప్పారు. కానీ ఆయన అకాల మరణంతో అనివార్యంగా వచ్చిన ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి బరిలో నిలిపారు.
మా నాన్నగారు నియోజకవర్గ అభివృద్ధికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నెరవేరుస్తా. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే.. తప్పకుండా ఇక్కడున్న పెద్దలందరికీ ఒక కొడుకు లాగా, అక్కలు, అన్నలందరికీ ఒక తమ్ముడిలాగా సేవ చేసుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అని తన ప్రసంగాన్ని ముగించారు.