హాలియా, మార్చి 31: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వేసిన శిలాఫలకాలే ల్యాండ్ మార్క్గా ఉంటాయి. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మొండిగోడలు పాలకుల పనితీరుకు అద్దం పడుతుంటాయి. గడిచిన రెండేళ్ల కాలంలో హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిధులేమీ విడుదల చేయకపోవడంతో ఇటీవల మున్సిపాల్టీలో కొలువుదీరిన కొత్త పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాలియా మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాగర్ ఎడమ కాల్వ వెంట ఉన్న బండ్ (కాల్వ కట్ట)ను కిలోమీటరు వేర సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ. 8 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. సగం పనులు పూర్తి కాగా, మిగిలిన సగం అలాగే ఉన్నాయి. రూ.2 కోట్లతో చేపట్టిన వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రూ.5కోట్లతో చేపట్టిన ఆడిటోరియం పనులు ప్రారంభానికే నోచుకోలేదు. రూ. కోటి తో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ పనులు బేస్మెంట్ వద్దనే నిలిచిపోయాయి. వైకుంఠధామం వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.70 లక్షలు విడుదల చేసినా ఇప్పటికీ చేపట్టనే లేదు. మినీ స్టేడియం నిర్మాణం కోసం రూ4.20 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.70 లక్షలతో ట్రాక్ నిర్మాణం పూర్తి చేయగా రూ.3 కోట్ల 50 లక్షలతో చేపట్టాల్సిన మినీ స్టేడియం పనులు చేపట్టకుండా కాంగ్రెస్ నాయకులు ఆ భూమిపై అక్రమ కేసులు వేసి అడ్డుకున్నారు. దీంతో యువకులు, క్రీడాకారులకు మినీ స్టేడియం కలగానే మిగిలింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాలి యా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గత రెండేళ్లలో మున్సిపాలిటీలో కొత్తగా ఒక్క అ భివృద్ధి పని కూడా చేపట్టలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా స్థానిక ఎమ్మెల్యే పూర్తి చేయించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
హాలియా మున్సిపాల్టీ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 60 కోట్లు విడుదల చేసింది. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టడంతో హాలియా మున్సిపాలిటీ రూపురేఖలే మారిపోయాయి. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలోనే హాలియా మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, వైకుంఠధామం, 30 పడకల దవాఖాన నిర్మాణం, పోస్టుమార్టం గది , అంతర్గత రహదారులు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం, మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకం ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడంతో మున్సిపాలిటీ రూపు రేఖలే మారిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాటి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నాటి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మున్సిపాలిటీలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు.
హాలియా గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. దివంగత నేత నోముల నర్సింహయ్య, ఆయన కుమారుడు నోముల భగత్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం అభివృద్ధి అంటే ఏమిటో స్థానిక ప్రజలకు తెలిసింది. ఇంటింటికి తాగునీరు, సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం, వీధిలైట్ల్లు. ప్రధాన రహదారి వెంట సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తదితర అనేక అభివృద్ధి పనులు చేయించారు.
-కడమంచి ప్రమీల, నాలుగో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్, హాలియా