యాదాద్రి భువనగిరి, మే 5 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలు విషయంలో కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులను దగా చేస్తున్నది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి.. ఫలాలు అందకుండా అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్ కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నది. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా లబ్ధిదారులకు యూనిట్లు మం జూరు చేయకుండా తాత్సారం చేస్తున్నది. కేసీఆర్కు పేరొస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే కావాలనే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకున్నది. ఈ పథకం కిందం ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. తొలి విడత సమర్థవంతంగా అమలు చేసి చూపించింది. దళిత బంధు పథకాన్ని తొలుత రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు చేశారు. నాటి సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద దీనిని ప్రారంభించారు. గ్రామంలోని 75 మంది ఎస్సీ కుటుంబాలకు దళితబంధు అమలు చేశారు. తొలి విడతలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 412 మంది లబ్ధిదారులకు నిధులు గ్రౌండింగ్ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో ల్యాబ్, వెల్డింగ్, కిరాణ, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, క్లాస్ షోరూమ్, సెంట్రింగ్, టీకప్పుల తయారీ తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా నెలకు రూ. 30వేల నుంచి రూ. 50వేల దాకా సంపాదిస్తున్నారు.
దళితుల దశ మార్చే ఈ పథకం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యథావిధిగా అమలు చేయకుండా స్కీంను పక్కనబెట్టింది. 2023 జూలైలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రెండో విడత దళితబంధు ప్రక్రియ ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో 13,200 మందికి ఇవ్వాలని నిర్ణయించింది. దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ కూడా జరిగింది. కొందరు లబ్ధిదారులకు యూనిట్లు సైతం మంజూరయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని 254 మంది దళితులకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 3 లక్షల చొప్పున జమ చేశారు. మిగతావి విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు. దీంతో పథకం అమలు పెండింగ్లో పడిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నో హామీలు ఇచ్చింది. దళిత బంధు కింద రూ.10లక్షల ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలుకు రూ. రెండు లక్షలు అదనంగా కలుపుకొని రూ. 12లక్షల ఇస్తామని ప్రకటించింది. చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో సైతం పొందుపరిచింది. ఈ హామీ అమలు కోసం దళితులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అసలు ఈ పథకం ఊసే ఎత్తకపోవడంతో ఎస్సీలు ఆగ్రహంగా ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లు కావొస్తున్నది. కానీ ఇప్పటి వరకు దళిత బంధు అమలుపై శ్రద్ధ పెట్టలేదు. కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు.. ఇప్పటికే మంజూరై.. డబ్బులు ఖాతాలో జమ అయిన లబ్ధిదారులకు కూడా మొండి చెయ్యి చూపిస్తున్నది. ఖాతా లు ఫ్రీజ్ చేయడంతో లబ్ధిదారులు స్వయంగా డ్రా చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం గ్రౌండింగ్ చేయడం లేదు. యూనిట్లు మంజూరైన వారికి గ్రౌండింగ్ చేయాలని 2025 లోనే రాష్ట్ర కార్పొరేషన్ ఎండీ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరిలో మాత్రం పట్టించుకోవడంలేదు. ఆదేశాలు జారీ చేసి.. ఏడాది దాటినా పథకం అమలుకు మోక్షం లభించలేదు. లబ్ధిదారులు మాత్రం నిత్యం కలెక్టర్, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని సార్లు వినతిపత్రాలు సమర్పించినా లాభం లేకుండా పోతున్నది. మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే ఉద్దేశ పూర్వకంగా దీనిని ఆపుతున్నారనే ప్రచారం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మహోన్నత పథకం అమలు చేస్తే కేసీఆర్కు పేరొస్తుందనే భావనలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కిరాణ దుకాణం మంజూరైంది. బ్యాంకు ఖాతాలో రూ.3లక్షలు జమ అయ్యాయి. అసెం బ్లీ ఎన్నికలు రావడంతో అమలు ప్రక్రియ పెండింగ్లో పెట్టారు. కానీ ఎన్నికలు ముగిసినా పథకాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండున్నరేండ్ల కాలానికి గానూ రూ.20 వేల వడ్డీ కూడా బ్యాంకులో జమ అయ్యాయి. కానీ గ్రౌండింగ్ మాత్రం చేయడం లేదు. వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసి.. న్యాయం చేయాలి.
-నాగయ్య, లబ్ధిదారుడు, అడ్డగూడూరు