నీలగిరి, డిసెంబర్ 2: నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారుల పనితీరు..దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి గరం గరం అయ్యారు. మంగళవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తదితర వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది పనితీరును తెలుసుకుంటునే అన్ని వార్డులు కలియతిరిగారు. దవాఖాన సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డుల్లో పురుషులు ఏం చేస్తారని.. వారికి ఏం పని అంటూ ప్రశ్నించారు. వార్డుల్లో ఉన్న పురుషులందరినీ బయటకు పంపాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ప్రసూతి సమయంలో పురుషులున్నందున డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దవాఖానలో ప్రసవించిన మహిళలకు సహాయకులుగా ఎక్కువ మంది ఉండడం వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, అందువల్ల ఎకువ మంది ఉండకుండా, కేవలం ఒకరు మాత్రమే సహాయకులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్రతి వార్డులో ఉన్న సీసీ కెమెరాలు, ఆరు బయట వాహనాలు నిలిపే చోట ఇతర ముఖ్యమైన స్థలాల్లో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని దవాఖాన వర్గాలను ఆదేశించారు. ప్రత్యేకించి ఆటోలు నిలిపే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట దవాఖాన సూపరింటెండెంట్ అరుణకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ నగేశ్, ఎంసీహెచ్ ఇన్చార్జి వందన తదితరులు ఉన్నారు.