మిర్యాలగూడ, జనవరి 4 : రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్లర్లతో గురువారం సమావేశమయ్యారు. మిల్లుల వారీగా ఇప్పటి వరకు ఇచ్చిన సీఎంఆర్ వివరాలను స్థానిక అధికారుల నుంచి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 69 రైస్ మిల్లుల నుంచి 2100 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉన్నదని, ఈ నెల 30లోగా అందించాలని అన్నారు. సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎఫ్సీఐ గోదాములను పరిశీలించి సకాలంలో ఏసీలు వస్తున్నాయా.. అన్లోడింగ్ జరుగుతుందా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మేనేజర్ నాగేశ్వర్రావు, ఆర్డీఓ చెన్నయ్య, సివిల్ సప్లయ్ డీటీ జావేద్, ఆర్ఐ సురేందర్సింగ్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు.