నీలగిరి, డిసెంబర్ 7 : సాయుధ దళాల్లో పాల్గొని యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ప్రతి పౌరుడు అండగా నిలువాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారి సాయార్ధం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారి సాయార్ధం రాష్ట్ర స్థాయిలో గవర్నర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యములో పతాక దినోత్సవ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నిధికి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఈనిధి ద్వారా మాజీ సైనికులకు, సైనిక వితంతువులకు వారిపై ఆధారపడిన వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. అనంతరం ఎన్సీసీ సౌట్స్, మాజీ సైనికులు, ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం సిబ్బంది, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఎస్పీ శ్రీధర్రెడ్డిలకు ఫ్లాగ్ డే స్టికర్ అందించి వారి నుంచి విరాళాలు సేకరించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయల్లో అధికారులు, వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి మక్బూల్ అహ్మద్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.