నల్లగొండ, జనవరి 19 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా సవరణలో భాగంగా 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని కలెక్టర్ దాసరి హరిచందన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడంతోపాటు చిరునామా, పోలింగ్ కేంద్రాల మార్పు వంటివి సవరణలు కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బూత్ లెవల్ అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితా ఫారం 6,8లతో రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటర్లు, 18 ఏండ్లు నిండిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దీనిపై శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హారిచందనతోపాటు అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీఓలు రవి, శ్రీరాములు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్, మిషన్ భగీరథ
గ్రామీణ ప్రాంతాల్లో ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హరి చందన అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మిషన్ భగీరథ, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలు, పథకాల అమలు గురించి ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీర్లు చెన్నారెడ్డి, లలిత, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాపారావు, వంశీ కృష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.