జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కె.జెండగే చెప్పారు. ఇబ్బందులేవీ లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే మూసివేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో కలిపి 4,39,100 మంది ఓటర్లు ఉండగా, 566 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా సీ విజిల్ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో సాంకేతికను విరివిగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులకు 1905 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు విషయాలను ఆయన వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం నమస్తే తెలంగాణ నిర్వహించిన ఇంటర్వ్యూలో కలెక్టర్ హనుమంతు కె. జెండగే పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
ఎన్నికల సజావుగా జరిపేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు, మూడు స్టాటిస్టికల్ బృందాలతోపాటు మోడల్ కోడ్ టీంలు ఏర్పాటు చేశాం. ఇవి ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. సరిపడా స్టాఫ్ను నియమించాం. అవసరమైతే మరింత మందిని ఉపయోగించుకుంటాం. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా 1905 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయొచ్చు లేదా సీ-విజిల్కు ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలంతా సీవిజిల్ను ఉపయోగించుకోవాలి.
జిల్లాలోని భువనగిరి, ఆలేరు రెండు నియోజకవర్గాల్లో 4,39,100 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,19,792 మంది పురుషులు, 2,19,290 మంది స్త్రీలు, 18మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 2,11,362 మంది, ఆలేరు నియోజకవర్గంలో 2,27,738 మంది ఓటర్లు ఉన్నారు. మండలాల వారీగా చూస్తే భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి మండలంలో అత్యధికంగా 82, 879మంది ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించి 566 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు ఉంది.
అక్రమ మద్యం, డబ్బు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అక్రమ మద్యం రవాణాలో సాధారణమైతే బైండోవర్, తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తాం. బెల్ట్ షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకున్నాం. చెక్పోస్టుల వద్ద 24గంటల నజర్ పెట్టాం.
నామినేషన్ల ఆఖరి రోజు వరకు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన యువతను వివిధ ప్రచార కార్యక్రమాల ద్వారా ఓటర్లుగా నమోదు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఓటరు హెల్ప్ లైన్ ద్వారా చెక్ చేసుకోవాలి. 2018లో రెండు నియోజకవర్గాల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
అసాధారణమైన, అనుమానాస్పద ఖాతాల లావాదేవీలపై బ్యాంకర్లను అప్రమత్తం చేశాం. ఒక అకౌంట్ నుంచి అనేక ఖాతాలకు డబ్బు ట్రాన్జాక్షన్పై ఫోకస్ పెట్టాం. అభ్యర్థి నామినేషన్ వేశాక కొత్త అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అందుకోసం సకాలంలో సరైన్ చెక్బుక్స్ ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం స్పెషల్ టీంను నియమించాం.
ఎన్నికల ప్రవర్తన నియామాళి ప్రకారం ఎవరైనా 50వేలకు మించి నగదుతో ప్రయాణం చే యవద్దు. ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డ బ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాం. అత్యవసర వైద్యం, కాలేజ్ ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తీసుకెళ్లే వారు సరైన పత్రాలు తీసుకెళ్లాలి. రాజకీయలు పార్టీలు కార్యక్రమాలు చేపట్టాలంటే సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తప్పనిసరి.